Netherlands: తక్కువ స్టార్చ్, తక్కువ షుగర్.. మార్కెట్లోకి కొత్త రకం ఆలుగడ్డలు
ఈ వార్తాకథనం ఏంటి
అన్ని రకాల వంటల్లో సులభంగా కలిసిపోయే బంగాళాదుంపలు అంటే చాలామందికి ప్రత్యేకమైన మక్కువే ఉంటుంది. వీటితో చేసే కరకరలాడే చిప్స్, రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్లను చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. అయితే మధుమేహం(డయాబెటిస్)ఉన్నవారు ఆరోగ్య కారణాల వల్ల బంగాళాదుంపల్ని ఎక్కువగా దూరం పెడుతుంటారు. అలాంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మార్కెట్లోకి 'లేడీ రోసెట్టా' అనే కొత్త రకం బంగాళాదుంపలు రాబోతున్నాయి. ఈ ప్రత్యేక రకం బంగాళాదుంపల సాగు ప్రపంచంలో తొలిసారి నెదర్లాండ్స్లో ప్రారంభమైంది. అనంతరం అది ఇతర దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న రాజమాత విజయరాజె సింధియా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఏరోపోనిక్స్ ప్రయోగశాలలో ఈ లేడీ రోసెట్టా రకం ఆలుగడ్డలను సాగు చేస్తున్నారు.
వివరాలు
మట్టి ఉపయోగించకుండా, మొక్కలను తీగలపై వేలాడదీసి పెంచుతారు
ఈ విధానంలో మట్టి ఉపయోగించకుండా, మొక్కలను తీగలపై వేలాడదీసి పెంచుతారు. మరో రెండు సంవత్సరాల్లో ఈ విత్తనాలు రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఏరోపోనిక్స్ ప్రాజెక్ట్ హెడ్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుష్మా తివారీ వెల్లడించారు. ఈ రకం బంగాళాదుంపల్లో పిండిపదార్థం (స్టార్చ్) మోతాదు చాలా తక్కువగా ఉండగా, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అలాగే చక్కెర శాతం కూడా అతి స్వల్పంగా ఉంటుంది. గుండ్రటి ఆకారంలో, లేత గులాబీ రంగుతో కనిపించే ఈ బంగాళాదుంపలు త్వరగా ఉడకవు, గట్టితనంతో ఉండటం వీటి మరో ప్రత్యేకత.