LPG shortage: దేశంలో LPG కొరత.. రూ.900 సిలిండర్ను రూ.2,800కు అమ్ముతున్న మధ్యవర్తులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరుగుతోంది. మధ్యవర్తులు, కొంతమంది గ్యాస్ ఏజెన్సీలు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని భారీగా ధరలు పెంచుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. సాధారణంగా రూ.900కు లభించే ఎల్పీజీ సిలిండర్ను కొన్ని చోట్ల రూ.2,800 వరకు అమ్ముతున్న ఘటనలు బయటపడుతున్నాయి. ఈ విషయాన్ని 'లోకల్ సర్కిల్స్' నిర్వహించిన సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు వంటగ్యాస్ సరఫరాలో అంతరాయం ఎదుర్కొంటున్నాయని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు. కొందరు అయితే గత వారం రోజులుగా గ్యాస్ సిలిండర్ దొరకక బ్లాక్ మార్కెట్ను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా సరఫరా వ్యవస్థలో గందరగోళం ఏర్పడిందని వారు పేర్కొన్నారు.
వివరాలు
ఒక్కో సిలిండర్పై అదనంగా రూ.100 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్న మధ్యవర్తులు
సర్వేలో పాల్గొన్న వినియోగదారులు మరో కీలక విషయాన్ని వెల్లడించారు. తమ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరాదారులు, మధ్యవర్తులు ఒక్కో సిలిండర్పై అదనంగా రూ.100 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ఒక్కో సిలిండర్కు రూ.1,500 నుంచి రూ.2,800 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇది సాధారణ ధరతో పోలిస్తే దాదాపు రెండింతలు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డేటా ప్రకారం, భారత్లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర సాధారణంగా రూ.900 నుంచి రూ.1,000 మధ్య ఉంటుంది. అదే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ఉంటుంది.
వివరాలు
వంట కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్న అనేక కుటుంబాలు
గ్యాస్ కొరత కారణంగా అనేక కుటుంబాలు వంట కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. కొందరు ఇండక్షన్ స్టవ్ల వంటి విద్యుత్ పరికరాలను ఉపయోగించడం ప్రారంభించారు. మరోవైపు గ్యాస్ సరఫరా అంతరాయం కొనసాగితే మెనూలో కొన్ని వంటకాలను తగ్గించాల్సి రావచ్చు,ధరలు పెంచాల్సి రావచ్చు లేదా తాత్కాలికంగా రెస్టారెంట్లు మూసివేయాల్సి రావచ్చు అని హోటల్ యజమానులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
గ్యాస్ సిలిండర్ బుకింగ్లో అందరికీ ఇబ్బందులేనా? సర్వే ఏమంటోంది?
దాదాపు 19 వేల మంది స్పందించిన ఈ సర్వేలో 43 శాతం మంది తమ ఇళ్లకు గ్యాస్ సిలిండర్ బుకింగ్లో ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. బుకింగ్ చేసిన తర్వాత సిలిండర్లు సాధారణంగానే డెలివరీ అవుతున్నాయని చెప్పారు. మిగిలినవారు మాత్రం సిలిండర్ కోసం సాధారణం కంటే ఎక్కువ రోజులు వేచి చూడాల్సి వస్తోందని చెప్పారు. కొందరు అయితే ఎక్కువ ధరలకు బ్లాక్ మార్కెట్లో సిలిండర్ కొనాల్సి వచ్చిందని కూడా వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు గురువారం తమ పరిధిలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పోలీసు సిబ్బందిని మోహరించి చట్టసమ్మత పరిస్థితులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వివరాలు
గ్యాస్ సిలిండర్ బుకింగ్లో అందరికీ ఇబ్బందులేనా? సర్వే ఏమంటోంది?
సరఫరా సమయంలో ఎలాంటి బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఎల్పీజీ సరఫరాలో అంతరాయం రావడానికి ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతలు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్తో జరుగుతున్న ఘర్షణల కారణంగా హోర్ముజ్ సముద్ర మార్గంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మార్గం ద్వారానే భారత్ తన ఎల్పీజీ దిగుమతుల్లో 85 నుంచి 90 శాతం వరకు సౌదీ అరేబియా, ఖతార్ వంటి పశ్చిమాసియా దేశాల నుంచి పొందుతోంది.
వివరాలు
పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
దేశంలో ఎల్పీజీ కొరత నాలుగో రోజు కూడా కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో సరఫరా అంతరాయాలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని పర్యవేక్షించి నిల్వదాచడం లేదా బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టాలని సూచించింది.
వివరాలు
గ్యాస్ సిలిండర్ బుకింగ్ 25 రోజులకు పెంపు
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చి కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగానికి గ్యాస్ సరఫరాను ప్రాధాన్యత ఇచ్చింది. రిఫైనరీలను పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని ఆదేశించి ఉత్పత్తి అయ్యే ఎల్పీజీని ప్రధానంగా గృహ వినియోగదారులకు అందించాలని సూచించింది. అలాగే నిల్వదాచడాన్ని అరికట్టేందుకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సమాచారం.