LOADING...
GP Mehra: మధ్యప్రదేశ్‌లో రిటైర్డ్ పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో లోకాయుక్త దాడులు..నగదు,కిలోల కొద్దీ బంగారం,వెండి స్వాధీనం
నగదు,కిలోల కొద్దీ బంగారం,వెండి స్వాధీనం

GP Mehra: మధ్యప్రదేశ్‌లో రిటైర్డ్ పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో లోకాయుక్త దాడులు..నగదు,కిలోల కొద్దీ బంగారం,వెండి స్వాధీనం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లో ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఇంట్లో జరిగిన లోకాయుక్త దాడులు పెను సంచలనం సృష్టించాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్‌లో (PWD) మాజీ చీఫ్ ఇంజనీర్ గణేశ్ ప్రణీత్ మెహ్రా ఇంటి వద్ద, ఇతర సంబంధిత ప్రదేశాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో అంచనాకు మించి విలువైన, అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. కేవలం నగదు, బంగారం మాత్రమే కాకుండా, ఏకంగా 17 టన్నుల తేనె నిల్వలు కూడా లభించడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. లోకాయుక్తకు లభించిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా, డీఎస్పీ స్థాయి అధికారులు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు భోపాల్, నర్మదాపురం ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి.

వివరాలు 

నగదును లెక్కించడానికి కౌంటింగ్ మెషీన్లు

భోపాల్‌లోని మణిపురం కాలనీలోని మెహ్రా నివాసంలో రూ.8.79 లక్షల నగదు, సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.56 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను గుర్తించారు. ఇలాంటి సోదాలు సమీపంలోని ఓపల్ రీజెన్సీ అపార్ట్‌మెంట్‌లోని మరొక నివాసంలో కూడా కొనసాగాయి. అక్కడ రూ.26 లక్షల నగదు, రూ.3.05 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారం, అలాగే 5.5 కిలోల వెండి లభించాయి. నగదును లెక్కించడానికి కౌంటింగ్ మెషీన్లు ఉపయోగించాల్సి వచ్చింది. అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం నర్మదాపురం జిల్లా సోహాగ్‌పూర్‌లోని మెహ్రా ఫామ్‌హౌస్ వద్ద కనిపించింది.

వివరాలు 

విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లో నిర్మాణంలో ఉన్న 32 కాటేజీలు, లగ్జరీ కార్లు 

అక్కడ 17 టన్నుల తేనె నిల్వలు కనుగొన్నట్టు అధికారులు తెలిపారు. అదనంగా, అదే ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న 32 కాటేజీలు, ఇప్పటికే పూర్తయిన 7 కాటేజీలు, 6 ట్రాక్టర్లు,చేపల పెంపకానికి ఒక చెరువు, గోశాల, ఒక గుడి వంటి అనేక ఏర్పాట్లు గుర్తించారు. ఈ ప్రాంగణంలో ఫోర్డ్ ఎండీవర్, స్కోడా స్లావియా,కియా సోనెట్,మారుతి సియాజ్ వంటి లగ్జరీ కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా,గోవింద్‌పురాలోని"కేటీ ఇండస్ట్రీస్"అనే బినామీ సంస్థలో కూడా లోకాయుక్త బృందం సోదాలు నిర్వహించింది. అక్కడ రూ.1.25 లక్షల నగదు,పలు కీలక పత్రాలు స్వాధీనం అయ్యాయి. మొత్తం లెక్క ప్రకారం,ఇప్పటివరకు రూ.36 లక్షలకు పైగా నగదు,2.6 కిలోల బంగారం,5.5 కిలోల వెండి, అనేక ఫిక్స్‌డ్ డిపాజిట్లు,ఇన్సూరెన్స్ పత్రాలు,షేర్ డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి.

వివరాలు 

లావాదేవీలపై లోతైన దర్యాప్తు

ఆస్తుల విలువ ఇంకా లెక్కిస్తున్నామని, దీని విలువ అనేక కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. ఇదివరకే మెహ్రా ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు.