Crashed plane: అస్సాంలో భారీ ప్రమాదం.. టేకాఫ్ తర్వాత కుప్పకూలిన విమానం
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం శనివారం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిధిలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాయి. అలాగే ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక పరిశీలన ప్రారంభించాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ఎవరైనా మృతి చెందారా లేదా గాయపడ్డారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.
వివరాలు
ప్రమాదాన్ని ధ్రువీకరించిన వాయుసేన
ఈ ఘటనను భారత వాయుసేన ధ్రువీకరించింది. పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. కాగా, ఇదే అస్సాంలో కొన్ని నెలల క్రితం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ Su-30MKI యుద్ధ విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మార్చి 5న జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సాధారణ శిక్షణా విహారయాత్ర కోసం బయలుదేరిన ఆ యుద్ధ విమానం సాయంత్రం 7:42 గంటల సమయంలో గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయింది.
వివరాలు
గతంలో కూడా ప్రమాదం
అనంతరం విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. తర్వాత జోర్హాట్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని కొండ ప్రాంతంలో విమానం కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రమాదంలో ఇద్దరు వాయుసేన పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.