Centre: భారత్లో ఉండే విదేశీయులకు కొత్త రూల్స్.. వీసా గడువు ముగిసేలోపు నమోదు తప్పదు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని ఇమిగ్రేషన్ నిబంధనల్లో కేంద్ర హోంశాఖ కీలక మార్పులు చేసింది. భారత్కు వచ్చిన విదేశీయులు తమకు అనుమతించిన గడువుకు మించి దేశంలో కొనసాగాలనుకుంటే, వీసా గడువు ముగిసేలోపు తప్పనిసరిగా విదేశీయుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. 180 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితి ఉన్న వీసాలతో భారత్కు వచ్చే విదేశీయులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటి నుంచి వారు దేశంలో మరింత కాలం ఉండాలనుకుంటే, వీసా గడువు ముగియకముందే సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు
ముందస్తు రిజిస్ట్రేషన్ను తప్పనిసరి
ఇప్పటివరకు వీసా గడువు పూర్తైన తర్వాత కూడా 14 రోజుల లోపు వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే తాజా మార్పులతో ఆ వెసులుబాటును తొలగించి, ముందస్తు రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది. దేశంలో నివసిస్తున్న విదేశీయుల వివరాలను సమర్థంగా పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
భారత్లో జన్మించే విదేశీయుల పిల్లల నమోదుపైనా కొత్త నిబంధనలు
భారత్లో నివసిస్తున్న విదేశీయులకు సంతానం కలిగిన సందర్భాల్లో కూడా కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. విదేశీ పౌరులకు చెందిన శిశువు భారత్లో జన్మిస్తే, పుట్టిన తేదీ నుంచి 30 రోజుల లోపు ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో ఒక మినహాయింపును కూడా కేంద్రం కల్పించింది. తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరులై ఉండి, తమ భారతీయ పౌరసత్వాన్ని కొనసాగించాలనుకుంటే, అలాంటి కుటుంబాలకు శిశువు జనన నమోదు నిబంధన నుంచి మినహాయింపు వర్తిస్తుంది.