Bihar: ప్రభుత్వ పథకాలపై వీడియోలు చేస్తే రూ.లక్ష వరకు నగదు.. ఇన్ఫ్లూయెన్సర్లకు బిహార్ బంపరాఫర్
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లను ఆకట్టుకునేలా బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సాధించిన విజయాలపై వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే.. గరిష్ఠంగా రూ.లక్ష వరకు నగదు బహుమతి పొందే అవకాశం కల్పించింది. ఈ మేరకు సోషల్ మీడియా పాలసీలో చేసిన మార్పులకు బిహార్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త విధానం ప్రకారం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ప్రభుత్వ విజయాలకు సంబంధించిన కంటెంట్ను రూపొందించే సోషల్ మీడియా క్రియేటర్లకు వారి వీడియోలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా నగదు చెల్లించనున్నారు.
వివరాలు
వైరల్ అయిన ప్రతి వీడియోకు ఈ నగదు బహుమతి వర్తించదు
ఒక వీడియోకు లక్ష వ్యూస్ వస్తే గరిష్ఠంగా రూ.10 వేల వరకు అందించనున్నారు.
అదే వీడియోకు 10 లక్షల వ్యూస్ వస్తే రూ.లక్ష వరకు నగదు బహుమతి లభిస్తుంది.
అయితే 10 లక్షలకు మించి వీక్షణలు వచ్చినా.. చెల్లించే మొత్తం రూ.లక్షకు మించదు.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతి వీడియోకు ఈ నగదు బహుమతి వర్తించదు.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగా రూపొందించిన కంటెంట్కు మాత్రమే ఈ ప్రోత్సాహకం అందుతుంది.
వీడియో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రచురించారు, దాని కంటెంట్ నాణ్యత ఎలా ఉంది, అందులో నమోదైన వీక్షణలు నిజమైనవేనా అనే అంశాలను అధికారికంగా పరిశీలించిన తర్వాతే చెల్లింపులు చేపట్టనున్నట్లు బిహార్ ప్రభుత్వం తెలిపింది.
వివరాలు
IPRD లో పేర్లను నమోదు చేసుకోవాలి
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు ముందుగా బిహార్ సమాచార, ప్రజా సంబంధాల విభాగం (IPRD)లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ విభాగం నుంచి అవసరమైన అనుమతి తీసుకోకుండా రూపొందించే వీడియోలను నగదు బహుమతి కోసం పరిగణనలోకి తీసుకోరు.
అంతేకాదు.. ప్రభుత్వ వద్ద నమోదైన క్రియేటర్ల సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ లేదా ఇతర ఛానెళ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు.
ఆయా ఖాతాలకు ఉన్న ఫాలోవర్ల సంఖ్యను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.
ఈ విధంగా కంటెంట్ నాణ్యత, వ్యూస్, సోషల్ మీడియా ఖాతాల వివరాలను ధ్రువీకరించిన అనంతరం అర్హత ఉన్న క్రియేటర్లకు నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు.