Mamata Banerjee: రూ.15 లక్షలే చరాస్తులు.. ఆసక్తికరంగా మమత అఫిడవిట్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదాపు పదిహేనేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నప్పటికీ నిరాడంబర జీవనశైలితో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఇప్పటికీ తన పేరిట ఇల్లు, భూమి లేవని ఆమె వెల్లడించడం మరోసారి చర్చనీయాంశమైంది. త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మమత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆమె ఆస్తుల వివరాలు బయటపడ్డాయి.
వివరాలు
ఆస్తుల వివరాలు ఇలా...
నామినేషన్ పత్రాల్లో మమతా బెనర్జీ కాళీఘాట్లోని 30బీ హరీశ్ ఛటర్జీ వీధిని తన చిరునామాగా పేర్కొన్నారు. అయితే ఆ ఇల్లు ఆమె పేరిట నమోదు కాలేదు. ఆమె పేరుమీద వ్యవసాయ భూమి, స్థలం లేదా నివాస ఆస్తులు ఏవీ లేవు. వ్యక్తిగత వాహనం కూడా లేదని వెల్లడించారు. అఫిడవిట్ ప్రకారం ఆమె వద్ద రూ.75,700 నగదు ఉంది. ఆమె పేరుపై రెండు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తిగత ఖాతాలో రూ.12,36,209 ఉండగా, ఎన్నికల ఖర్చుల కోసం తెరిచిన మరో ఖాతాలో రూ.40,000 మాత్రమే ఉన్నట్లు తెలిపారు. నగదు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం కలిపి మొత్తం చరాస్తుల విలువ రూ.15.37 లక్షలు.
వివరాలు
మమతా బెనర్జీపై లాంటి కేసులు నమోదు కాలేదు
గత ఎన్నికల సమయంలో 2021లో ఈ విలువ రూ.16.72లక్షలుగా ఉండగా, ప్రస్తుతం తగ్గడం గమనార్హం. మమత వద్ద కేవలం 9.75 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. 2021లో దీని విలువ రూ.88,837 కాగా, ప్రస్తుతం బంగారం ధరలు పెరగడంతో దాని విలువ రూ.1.75 లక్షలకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.40,600 టీడీఎస్ రిఫండ్ పొందినట్లు ఆమె తెలిపారు. రాయల్టీలు, బ్యాంకు వడ్డీలు ఆమె ప్రధాన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. విద్యార్హతల విషయానికి వస్తే,1970లో దేశబంధు శిశు శిక్షాలయం నుంచి మాధ్యమిక విద్య పూర్తిచేసిన మమత,1974లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం University of Calcutta నుంచి పీజీ పట్టా పొందారు.మమతా బెనర్జీపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని అఫిడవిట్లో వెల్లడైంది.