Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు చనిపోయారు. అయితే ఈ హింసపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనల వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని మమతా బెనర్జీ తెలిపారు. హింసాత్మక ఘటనలపై విచారణకు బెంగాల్కు బీజేపీ నిజనిర్ధారణ బృందాన్ని పంపడంపై మమత మండిపడ్డారు. మణిపూర్ మండుతున్నప్పుడు నిజనిర్ధారణ బృందం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి మొత్తం 19 మంది చనిపోయారని, అందులో ఎక్కువ మంది తృణమూల్ కాంగ్రెస్కు చెందిన వారే ఉన్నారని ఆమె అన్నారు.
మరణించిన వారి కుటుంబంలో ఒకరికి హోంగార్డు ఉద్యోగం: మమత
పంచాయతీ ఎన్నికల హింసలో మరణించిన 19 మందికి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి హోంగార్డు ఉద్యోగం ఇస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ 19మందిలో 10మంది టీఎంసీకి చెందిన వారు ఉన్నారని మమతా స్పష్టం చేశారు. అయితే పార్టీలతో సంబంధం లేకుండా మరణించిన అందరి కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. గ్రామీణ ఎన్నికలు జరిగిన 71,000 బూత్లలో కేవలం 60బూత్లలో మాత్రమే హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయని బెంగాల్ సీఎం పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ప్రజలకు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.