
Supreme Court: 'తాగిన తర్వాత మనిషి మృగం అవుతాడు': అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరణ
ఈ వార్తాకథనం ఏంటి
తన ఏడేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.
ఈ శిక్షను రద్దు చేయాలని ఆ దోషి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ అంశంపై ఇటీవల విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
మద్యం సేవించిన వ్యక్తి మానవత్వాన్ని కోల్పోయి మృగంలా మారతాడని ఆగ్రహంతో పేర్కొంది.
వివరాలు
మద్యం తాగిన తర్వాత మనిషి మానవత్వాన్ని కోల్పోయి మృగంలా ప్రవర్తిస్తాడు
''ఒక ఏడేళ్ల చిన్నారిపై ఇంత పాశవిక చర్య చేయడం అసహ్యకరం. ఒక తండ్రిగా ఎవరూ తమ కుమార్తెపై ఇలాంటి దారుణాన్ని చేసే అవకాశం లేదు. ఆ బాలిక తన తండ్రిపై అబద్ధపు ఆరోపణలు చేసే అవసరం ఏముంది? ఆమె తీవ్ర మానసిక బాధను అనుభవించింది. మద్యం తాగిన తర్వాత మనిషి మానవత్వాన్ని కోల్పోయి మృగంలా ప్రవర్తిస్తాడు. అతనికి బెయిల్ నిరాకరించడానికి పలు కారణాలున్నాయి. ఇప్పటికే దోషిగా తేలిన అతడికి శిక్ష నుంచి మినహాయింపు ఎలా ఇవ్వగలుగుతాం?'' అంటూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
దోషి చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.
వివరాలు
ఏడేళ్ల కుమార్తెపై లైంగిక దాడి
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు హృద్రోగ నిపుణుడిగా (కార్డియాలజిస్ట్) పనిచేస్తున్న వ్యక్తి. భార్యతో విడిపోయిన అనంతరం వారణాసిలో నివసిస్తున్నాడు.
ఈ సమయంలో తన ఏడేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి, ఆ విషయం తన భార్యకు చెప్పాడు.
దాంతో కుమార్తెను తన వద్దకు తీసుకెళ్లిన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ దారుణ ఘటన 2018లో చోటుచేసుకోగా, దర్యాప్తు అనంతరం నిందితుడిపై న్యాయస్థానం శిక్ష విధించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా, అతడి పిటిషన్ను అక్కడ తిరస్కరించడమైంది.