Maratha Reservation: మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి దిగొచ్చిన సర్కార్.. దీక్షను విరమించిన మనోజ్ జరంగే
మరాఠా రిజర్వేషన్ అంశంపై మహారాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఎట్టకేలకు ముగిసింది. మరాఠా రిజర్వేషన్ పోరాట నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒకరోజు అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం చివరకు దిగివచ్చి.. డిమాండ్లను అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని డిమాండ్లను అంగీకరించడంతో భారీ సంఖ్యలో మద్దతుదారుల మనోజ్ జరంగే పాటిల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సమక్షంలో శనివారం తన నిరాహార దీక్షను ముగించారు. అనంతరం సీఎం షిండే, మనోజ్ జరంగే పాటిల్ కలిసి నవీ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనోజ్, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం మధ్య శుక్రవారం రాత్రి చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలం అయ్యాయి.
ఓబీసీ-మరాఠాల విద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దు: మనోజ్ జరంగే
మరాఠా ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ మాట్లాడుతూ.. మరాఠాలకు రిజర్వేషన్ కోసం.. 54 లక్షల కుంబీ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఈ పోరాటం చేసినట్లు పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ కోసం ఒక తరం పోరాడిందన్నారు. తాను గత నాలుగు నెలలుగా ఉద్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోరాటంలో 300 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నిరాహార దీక్షకు తన శరీరం సహకరించనప్పటికీ.. నాకు మద్దతుగా నిలిచిన మరాఠా నాయకులను చూసి గర్వపడుతున్నట్లు వెల్లడించారు. ఈ రిజర్వషన్ వల్ల ఓబీసీ-మరాఠాల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేస్తే సహించేది లేదన్నారు. ఓబీసీ, మరాఠాల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నాయన్నారు.