Firecrackers Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం..మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని టోంక్ కాలాన్ ప్రాంతంలో ఉన్న బాణాసంచా తయారీ కర్మాగారంలో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.
వివరాలు
బాధితుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరం..
గాయపడిన వారిని స్థానికుల సహాయంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పేలుడు ప్రభావంతో పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వివరాలు
సంఘటనా స్థలానికి భారీగా పోలీసులు..
స్థానికుల వివరాల ప్రకారం, పేలుడు తీవ్రత అత్యంత భయానకంగా ఉంది. దీని ధాటికి వచ్చిన శబ్దం కిలోమీటరు దూరం వరకూ వినిపించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. పేలుడు కారణంగా ఫ్యాక్టరీ భవనం పూర్తిగా కూలిపోగా, సమీపంలోని ఇళ్ల గోడలు, కిటికీల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అలాగే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
వివరాలు
చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు చర్యలు..
మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కూలిపోయిన ఫ్యాక్టరీ శిథిలాల కింద ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జేసీబీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తూ, చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలను వేగవంతం చేశారు.