Meghalaya: మేఘాలయలో విద్యార్థుల ఆందోళన హింసాత్మకం.. వివేకానంద, నేతాజీ విగ్రహాల ధ్వంసం
ఈ వార్తాకథనం ఏంటి
మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (KSU) చేపట్టిన బ్లాక్ ఫ్లాగ్ మోటార్ సైకిల్ ర్యాలీ బుధవారం హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా కనీసం రెండు ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టినట్లు సమాచారం. నియామకాల్లో సంస్కరణలు, స్థానిక గిరిజనుల రక్షణ సహా ఐదు డిమాండ్లపై KSU కొంతకాలంగా ఆందోళన చేస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన ర్యాలీ పోలో, బారిక్, మావ్లై తదితర ప్రాంతాల మీదుగా సాగింది.
వివరాలు
NIC వాహనం ధ్వంసం
రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కాలనీలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన గాజు కవచం ధ్వంసమైంది.
బారిక్ ప్రాంతంలో పోలీసుల ఎస్కార్ట్ వాహనం అద్దం పగిలింది.
అలాగే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) వాహనం వెనుక అద్దాన్ని కూడా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టు 17, 18 తేదీల్లోనూ KSU ఆందోళనలు నిర్వహించింది. తమ డిమాండ్లపై స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 15 రోజుల గడువు విధించింది.
ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ఒక రోజు ముందే KSU హెచ్చరించింది.
వివరాలు
నియామకాల్లో సంస్కరణలు
KSU ప్రధాన డిమాండ్లలో మేఘాలయ రెసిడెంట్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ అమలు చేయడం ఒకటి.
మేఘాలయ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జిల్లా సెలెక్షన్ కమిటీల ద్వారా జరిగే నియామకాల్లో సంస్కరణలు తీసుకురావాలని కోరుతోంది.
రాష్ట్రంలో వలస కార్మికుల నియామకం, కార్యకలాపాలపై కఠినమైన నియంత్రణలు విధించాలని కూడా డిమాండ్ చేస్తోంది.
నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (NEIGRIHMS)లో నర్సుల నియామక ప్రక్రియపైనా KSU అభ్యంతరం వ్యక్తం చేసింది.
నియామక విధానంలో మార్పులు చేయాలని కోరుతోంది.
వివరాలు
ర్యాలీకి జిల్లా యంత్రాంగం అనుమతి
ఇదిలా ఉండగా, ఈస్ట్ జైంతియా హిల్స్లోని లుమ్ సైర్మన్ ప్రాంతంలో శ్రీ సిమెంట్ లిమిటెడ్ ప్రతిపాదించిన సున్నపురాయి తవ్వకాల ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణపైనా KSU వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.
ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించిన విధానం సరిగా లేదని పేర్కొంటూ, ఆ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
బుధవారం నిర్వహించిన ర్యాలీకి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది.
అయితే కొన్ని షరతులు విధించడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచింది.
KSU ప్రతినిధులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని ఈస్ట్ ఖాసీ హిల్స్ డిప్యూటీ కమిషనర్ అభిలాష్ బరన్వాల్ తెలిపారు.