Ponnam Prabhakar: ఆర్టీసీలో 3వేల కొత్త ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
కరీంనగర్లో 33 విద్యుత్ బస్సులను ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వానిది ప్రజాపాలన అని, మహిళలు ఉచిత ప్రయాణాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా శక్తి, మెప్మా సహకారంతో కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
కారుణ్య నియమాకాలపై దృష్టి
ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలు కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు, హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్ బస్సులు లేకుండా చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.