Assam: అస్సాంలో కాంగ్రెస్ ఎంపీపై దుండగుల దాడి.. చర్య తీసుకోవాలని పార్టీ డిమాండ్; స్పందించిన హిమంత శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్పై దుండగుల దాడికి తెగబడ్డారు.
పార్టీ కార్యక్రమానికి స్కూటర్పై వెళ్లే సమయంలో, ముసుగులు ధరించిన వ్యక్తులు బ్యాట్లతో దాడి చేశారు.
అయితే, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎంపీని సురక్షితంగా అక్కడి నుంచి తప్పించారు.
ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఈ దాడి గురువారం మధ్యాహ్నం నాగావ్ జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రికెట్ బ్యాట్తో దాడి చేయడం, ఎంపీని వెంబడించడం, భద్రతా సిబ్బందిలో ఒకరి ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తోంది.
వివరాలు
స్పందించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
ఈ ఘటనపై అస్సాం డీజీపీ హర్మీత్ సింగ్ స్పందించారు."స్వల్ప గాయాల మినహా ఎవరికీ పెద్ద ప్రమాదం జరగలేదు.
ఘటనపై ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు"అని తెలిపారు.అదే విధంగా,నాగావ్ ఎస్పీ స్వపనీల్ దేకా కూడా ఎంపీ హుస్సేన్ పార్టీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.
దాడిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా స్పందించారు.
ఎంపీ రకీబుల్ హుస్సేన్కు భద్రతను పెంచుతామని హామీ ఇచ్చారు.
అలాగే, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దూబ్రీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రకీబుల్, గత లోక్సభ ఎన్నికల్లో 10 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అయితే, ఈ దాడి వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు.