రావణకాష్టంగా మణిపూర్.. ముఖ్యమంత్రి నివాసంపై ఆందోళనకారుల దాడి
మణిపూర్ రాష్ట్రం మరోసారి తగలబడిపోతోంది. విద్యార్థుల హత్యను నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా మారింది. ఇంఫాల్ సరిహద్దులోని సీఎం బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై గురువారం రాత్రి ఓ గుంపు ముట్టడికి యత్నించింది. స్పందించిన కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులు గాల్లోకి తుపాకీ కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే దుండగుల గుంపు ఘటన స్థలం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సీఎం పూర్వీకుల ఇల్లు ప్రస్తుతం ఖాళీగానే ఉందని, ఇంటి చుట్టూ పోలీసు గస్తీ ఉందని పోలీసులు తెలిపారు. ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యపై మణిపూర్లో నిరసనలు ఆగట్లేదు. గురువారం ఉదయం పశ్చిమ ఇంఫాల్లో డిప్యూటీ కమిషనర్ (కలెక్టర్) ఆఫీసు, రెండు ప్రభుత్వ వాహనాలతో పాటు తౌబాల్ బీజేపీ ఆఫీసుకూ నిప్పు అంటించారు.
మణిపూర్ క్యాడర్ కు మారిన శ్రీనగర్ సీనియర్ ఎస్పీ రాకేశ్ బల్వాల్
మణిపూర్లో దారుణ పరిస్థితులను చక్కదిద్దేందుకు శ్రీనగర్ సీనియర్ ఎస్పీ రాకేశ్ బల్వాల్ను కేంద్ర హోంశాఖ బరిలోకి దించింది. 2019 పుల్వామా ఉగ్రదాడిపై దర్యాప్తు బృందంలో రాకేశ్ బల్వాల్ ఒకరు. ఈ మేరు ఆయన్ను మణిపూర్ క్యాడర్కు మార్చుతూ గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. అస్తికలు తెచ్చిస్తే అంత్యక్రియలు చేసుకుంటాం : తల్లిదండ్రులు మరోవైపు తమ పిల్లల అస్థికలు తెచ్చివ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల మృతదేహాల్ని ఇప్పటిేకీ పోలీసులు గుర్తించకపోవటంపై మండిపడుతున్నారు. కనీసం పిల్లల అవశేషాలనైనా గుర్తించి అప్పగించాలని, ఈ మేరకు అంత్యక్రియలు నిర్వహించుకుంటామన్నారు.పిల్లలకు సంబంధించిన ఆనవాళ్లు దొరక్కపోవడంపై తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హింసను పరిష్కరించే ఉద్దేశం బీజేపీ అగ్రనేతలకు లేదని భగ్గుమన్న మణిపూరీ నటుడు రాజ్కుమార్ సోమేంద్ర ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.