Kishan Reddy: తెలంగాణలో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.. 42 స్టేషన్లపై ఫోకస్
ఈ వార్తాకథనం ఏంటి
రూ.27 కోట్ల వ్యయంతో చేపడుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో కలిసి పరిశీలించారు. స్టేషన్లో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణతో పాటు తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
దివ్యాంగులకు ఆధునిక వసతులు
వికారాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులను రూ.27 కోట్లతో చేపట్టినట్లు వివరించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లో ఎస్కలేటర్, రెండు లిఫ్టులు, క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో పాటు దివ్యాంగులకు ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు.
ఈ ఏడాది చివరి నాటికి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ ఎంతో కీలకమని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.