Seva Teerth: సౌత్ బ్లాక్కు భిన్నంగా మోదీ కొత్త కార్యాలయం.. సేవా తీర్థ్ ప్రత్యేకతలివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి కొత్త చిరునామా సిద్ధమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు న్యూదిల్లీ లోని దారా షికోహ్ రోడ్పై నిర్మించిన 'సేవా తీర్థ్' సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడే కొత్త ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)తో పాటు కేబినెట్ సచివాలయం, జాతీయ భద్రతా మండలి సచివాలయం కార్యాలయాలు పనిచేయనున్నాయి.
Details
సౌత్ బ్లాక్కు వీడ్కోలు
స్వాతంత్ర్యం తర్వాత దాదాపు 78 సంవత్సరాలుగా సౌత్ బ్లాక్లోనే ప్రధాని కార్యాలయం కొనసాగుతోంది. ఇది దేశ కార్యనిర్వాహక వ్యవస్థకు కేంద్రబిందువుగా నిలిచింది. అయితే ఇప్పుడు కాలనీయ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ భవనాన్ని విడిచి, ఆధునిక భారత ఆత్మను ప్రతిబింబించే 'సేవా తీర్థ్'లోకి మారుతోంది. ఫిబ్రవరి 13 మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు సేవా తీర్థ్ సముదాయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అదేవిధంగా 'కర్తవ్య భవన్ 1, 2' భవనాలను కూడా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం సేవా తీర్థ్లో జరిగే ప్రజా కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించనున్నారు.
Details
ఏఏ మంత్రిత్వ శాఖలు మారనున్నాయి?
కర్తవ్య భవన్ 1, 2లకు కేంద్ర ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, కార్పొరేట్ వ్యవహారాలు, విద్య, సాంస్కృతిక, న్యాయశాఖ, సమాచార ప్రసార, వ్యవసాయం, రైతు సంక్షేమ, రసాయనాలు, ఎరువులు, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు మారనున్నాయి. సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో నిర్మించిన సేవా తీర్థ్ సముదాయం, కేంద్ర ప్రభుత్వం చేపట్టినసెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టు లో భాగం. 2019లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ లక్ష్యం దేశ కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలతో పాటు ప్రజా ప్రదేశాలను ఆధునీకరించడం. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 2023లో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభమైంది. 2025లో కామన్ సెంట్రల్ సచివాలయ భవనాల తొలి దశ ప్రారంభమైంది.
Details
సేవా తీర్థ్ ప్రత్యేకతలు
'ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్'గా పిలవబడిన సేవా తీర్థ్ ఎరుపు, పసుపు రాళ్లతో నిర్మించిన ఆధునిక డిజైన్ కలిగిన సముదాయం. ఓపెన్ ఫ్లోర్ నమూనాలో నిర్మించబడిన ఈ భవనం భారతీయ నాగరికత ప్రతిబింబంతో కూడిన ఆధునిక శైలిని కలిగి ఉంది. ఇక రైసినా హిల్పై ఉన్న సౌత్ బ్లాక్ కాలనీయ శైలిలో 1926-27లో హెర్బర్ట్ బేకర్ రూపొందించారు. సేవా తీర్థ్ భవనం అత్యాధునిక భద్రతా వ్యవస్థలతో సజ్జమై ఉంది. భూకంప నిరోధకంగా, అన్ని పరిస్థితుల్లోనూ కార్యకలాపాలు కొనసాగించేలా రూపకల్పన చేశారు. ఇందులో 'ఇండియా హౌస్' అనే ఆధునిక కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా ఉంది. ఇది ద్వైపాక్షిక సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు, మీడియా సమావేశాలకు వేదిక కానుంది.
Details
సమన్వయం, సమర్థత లక్ష్యం
సౌత్ బ్లాక్లో ఇలాంటి ప్రత్యేక స్థలం లేకపోవడం వల్ల వివిధ ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించాల్సి వచ్చేది. సేవా తీర్థ్ వన్లో PMO, సేవా తీర్థ్ టూలో కేబినెట్ సచివాలయం, సేవా తీర్థ్ త్రీలో జాతీయ భద్రతా మండలి సచివాలయం మరియు జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం పనిచేయనున్నాయి. ఇంతకుముందు ఇవన్నీ వేర్వేరు ప్రదేశాల్లో ఉండడం వల్ల సమన్వయం కష్టంగా ఉండేది. సేవా తీర్థ్ ద్వారా మూసివేసిన గదుల పరిపాలన విధానానికి బదులుగా ఓపెన్, షేర్డ్ వర్క్ స్పేస్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డిజిటల్ ఇంటిగ్రేషన్, కేంద్రీకృత స్వాగత కేంద్రాలు, ప్రజలతో నేరుగా అనుసంధానించే వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ భవనాలు 4-స్టార్ GRIHA ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు.
Details
మ్యూజియంగా మారనున్న నార్త్, సౌత్ బ్లాక్స్
పునర్వినియోగ శక్తి వనరులు, నీటి సంరక్షణ, వ్యర్థ నిర్వహణ, శక్తి సామర్థ్య సదుపాయాలు ఇందులో ఉన్నాయి. పీఎంఓ సేవా తీర్థ్కు మారిన తర్వాత చారిత్రక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలను 'యుగ యుగిన్ భారత్ సంగ్రహాలయ' పేరుతో ప్రజలకు అందుబాటులో ఉన్న మ్యూజియంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా సేవా తీర్థ్ ప్రారంభంతో భారత పరిపాలనా వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది.