India-Myanmar: పరస్పర ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలను అడ్డుకుంటాం: భారత్, మయన్మార్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ భద్రతా ప్రయోజనాలకు విరుద్ధంగా తమ భూభాగాన్నిఎలాంటి శక్తులు వినియోగించుకునే అవకాశాన్ని ఇవ్వబోమని మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ అంగ్ హయింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు. సోమవారం జరిగిన ఇరుదేశాల నేతల సమావేశంలో ఈ అంశంతో పాటు వాణిజ్యం,రక్షణ,ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై సమగ్రంగా చర్చించారు. రెండు నెలల క్రితమే మయన్మార్ అధ్యక్ష పదవిని చేపట్టిన హయింగ్ ప్రస్తుతం ఐదురోజుల భారత పర్యటనలో భాగంగా దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు. సమావేశంలో మయన్మార్లో సైనిక నిర్బంధంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూచీ అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించినట్లు విదేశాంగ కార్యదర్శి వివేక్ మిస్రీ వెల్లడించారు.
వివరాలు
మయన్మార్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి భారత్ పూర్తి మద్దతు: మోదీ
మయన్మార్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పరస్పర ప్రయోజనాలు, భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలకు తమ తమ దేశాల భూభాగాన్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదని ఇరు దేశాల నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మిస్రీ పేర్కొన్నారు.