Page Loader
Mysterious deaths: రాజౌరీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణాలు.. విచారణకు సిట్ ఏర్పాటు 
రాజౌరీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణాలు.. విచారణకు సిట్ ఏర్పాటు

Mysterious deaths: రాజౌరీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణాలు.. విచారణకు సిట్ ఏర్పాటు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామం అంతుచిక్కని మరణాల కారణంగా భయభ్రాంతులకు గురవుతోంది. గడచిన నెలన్నర కాలంలో అనుమానాస్పద పరిస్థితుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మరణాలకు వైరస్ లేదా బ్యాక్టీరియా కారణం కాదని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. పరిస్థితి మరింత నిశితంగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.

వివరాలు 

సహపంక్తి భోజనంతో.. 

గత డిసెంబర్ 7న బుధాల్ గ్రామంలో జరిగిన సహపంక్తి భోజనం తర్వాత, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అస్వస్థతకు గురవగా, వారిలో ఐదుగురు మృతి చెందారు. డిసెంబర్ 12న మరో విందులో పాల్గొన్న కుటుంబంలోని తొమ్మిది మంది అనారోగ్యం బారిన పడ్డారు, వారిలో ముగ్గురు మరణించారు. జనవరి 12న మరో ఘటనలో, ఒక కుటుంబంలోని పది మంది అస్వస్థతకు గురవగా, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వారిలో ఒక పదేళ్ల బాలిక మృతి చెందగా, మరో 15 ఏళ్ల అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది.

వివరాలు 

వైరస్‌, బ్యాక్టీరియా కాదు.. 

వైరస్ లేదా బ్యాక్టీరియా కారణాలు లేవని పుణె, దిల్లీ, లఖ్‌నవూ, గ్వాలియర్, చండీగఢ్, జమ్మూలలోని ల్యాబ్‌లలో జరిగిన పరీక్షలు నిర్ధారించాయి. కానీ ఐఐటీఆర్ టాక్సికాలజీ రీసెర్చ్ చేసిన విశ్లేషణలో విషపూరిత పదార్థాలు గుర్తించారు. ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఆహారం, నీటి నమూనాలను సేకరించి పరిశీలిస్తోంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సకీనా ఇటూ స్పష్టం చేశారు.