Nara Bhuvaneswari : మళ్లీ ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. ఉత్తరాంధ్రలో మూడ్రోజులు పర్యటన!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. వారానికి మూడ్రోజుల పాటు ఆమె పర్యటిస్తారు. ఈ నెల 3నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో 'నిజం గెలవాలి' పేరుతో ఆమె పర్యటించనున్నారు. 3న విజయనగరం,4న శ్రీకాకుళం, 5న విశాఖ పట్నం జిల్లాలకు భువనేశ్వరి వెళ్లనున్నారు. గతంలో చంద్రబాబు (Chandra Babu) స్కిల్ స్కాంలో సీఐడీ అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపాక నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో ఓ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.
రేపటి నుంచి ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన
అయితే చంద్రబాబుకు బెయిల్ వచ్చాక ఆ యాత్ర ఆగిపోయింది. మళ్లీ తిరిగి నిజం గెలవాలి యాత్రను ప్రారంభించేందుకు నారా భువనేశ్వరి సిద్ధమయ్యారు. అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ (Nara Lokesh) పర్యటనలు కూడా ఖరారయ్యాయి. ఈ నెల 5 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 5న చంద్రబాబు తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు. మరోవైపు సంక్రాంతి వరకు మంగళగిరిలో నారా లోకేష్ విస్తృతంగా పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారు.