Page Loader
high heat: అధిక ఉష్ణం కారణంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు.. నష్టాల వివరాలివే!
అధిక ఉష్ణం కారణంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు.. నష్టాల వివరాలివే!

high heat: అధిక ఉష్ణం కారణంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు.. నష్టాల వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూతాపం ఆందోళనకర రీతిలో పెరుగుతుండటంతో ప్రకృతి వైపరీత్యాలు మానవజాతిని క్షోభకు గురిచేస్తున్నాయి. తీవ్ర వడగాలులు, అతి భారీవర్షాలు, పిడుగుపాట్లు, కొండచరియలు, వరదలు, హిమానీనదాల కరుగుదల వంటి భయంకర ప్రభావాల కారణంగా 2024లో దేశవ్యాప్తంగా విపరీత ప్రాణ, ఆస్తినష్టం చోటుచేసుకుంది. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితికి చెందిన 'ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)' ఇటీవల విడుదల చేసిన నివేదిక ఆసియా ఖండం భూతాపం వల్ల అతలాకుతలం అవుతోందని హెచ్చరించింది. 2024లో ఆసియాలోని వాతావరణ పరిస్థితులపై సోమవారం డబ్ల్యూఎంవో ఈ నివేదికను జారీ చేసింది.

Details

నివేదికలోని ముఖ్యాంశాలు 

2024 భూతాపం కారణంగా చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయికి చేరిన సంవత్సరం. హిమానీనదాల కరుగుదలతో సముద్ర మట్టాలు పెరిగాయి, ఫలితంగా తీరప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. వరదల కారణంగా మరణాల రేటు ఏటా పెరుగుతోంది. 2024లో దేశంలోని అనేక ప్రాంతాల్లో పిడుగుపాట్ల వల్ల 1,300 మంది ప్రాణాలు కోల్పోగా, జులై 10న ఒక్కరోజే ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఝార్ఖండ్‌లలో 72 మంది మృత్యువాత పడ్డారు. తీవ్ర వడగాలుల ప్రభావంతో దేశవ్యాప్తంగా 450 మందికిపైగా మృతిచెందారు. కేరళలోని వయనాడ్‌ జిల్లాలో గతేడాది జులై 30న 48 గంటల్లోనే 500 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొండచరియలు విరిగి పలు గ్రామాలు మట్టిపాలైపోయాయి. 350 మంది చనిపోగా, అపార ఆస్తినష్టం సంభవించింది.

Details

నివేదికలోని ముఖ్యాంశాలు 1/2

పలు రాష్ట్రాల్లో తుఫాన్లు బీభత్సం సృష్టించాయి. నేపాల్, చైనా తదితర దేశాల్లోనూ ఇలాంటి విపత్తులు చోటుచేసుకున్నాయి. 1961-1990 మధ్య సగటుతో పోలిస్తే 1991-2024 మధ్య ఉష్ణోగ్రతలు 1.04 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. 2024లో వీచిన తీవ్ర ఉష్ణ గాలుల కారణంగా ఆసియాలో సముద్రాల ఉపరితలం వేడెక్కింది, ప్రపంచ సగటుతో పోలిస్తే ఇక్కడ రెండు రెట్లు అధిక భూతాపం కనబడింది. ఆసియాలోని పసిఫిక్, హిందూ మహాసముద్రాల మట్టం పెరగడంతో తీరప్రాంతాలపై ముంపు ముప్పు పెరిగింది. చలికాలంలో హిమపాతం తగ్గింది. వేసవిలో ఉన్నత ఉష్ణోగ్రతల కారణంగా హిమానీనదాలు తీవ్రమైన నష్టం చవిచూశాయి.

Details

నివేదికలోని ముఖ్యాంశాలు 1/3

ముఖ్యంగా మధ్య హిమాలయాలు, టియాన్‌షాన్‌ శ్రేణుల్లోని 23 హిమానీనదాల క్షయత తీవ్రంగా కనబడింది. దీనివల్ల భారీ వరదలు, కొండచరియలు సంభవించి, అనేక ప్రాణాలను బలి తీసుకోగా, వ్యవసాయరంగంపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ అనూహ్య వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనడానికి ఆయా దేశాలు ముందస్తు హెచ్చరికలను జారీ చేసి, తగిన రక్షణ చర్యలు చేపడితే ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని తగ్గించుకోవచ్చని డబ్ల్యూఎంవో నివేదిక సూచించింది.