Kerala: 1500 మంది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెన్షన్.. వడ్డీతో సహా వసూలు చేయాలని మంత్రి ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
సమాజంలోని బలహీన వర్గాలకు, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన వారికి సామాజిక భద్రత పింఛన్లు (Pensions) ప్రభుత్వ అధికారులు అక్రమంగా పొందుతున్నారు.
వారు తమ జీతానికి అదనంగా, ప్రభుత్వం నుంచి రూ.1600 పింఛను కూడా పొందుతున్నారని తాజా ఆడిట్లో వెల్లడైంది.
కేరళలో 1498 మంది ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక పెన్షన్ దొంగిలించుకుంటున్నట్లు గుర్తించారు.
ఇందులో గెజిటెడ్ అధికారులు, కాలేజీ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ఈ అక్రమాలు ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ కేరళ మిషన్ నిర్వహించిన ఆడిట్లో బయటపడ్డాయి.
వివరాలు
కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి ఆదేశం
కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ వర్గాల దాదాపు 62 లక్షల మందికి నెలవారీ రూ.1600 పెన్షన్ అందిస్తోంది.
ఈ అక్రమాల నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ పొందిన ఉద్యోగుల నుంచి వడ్డీతో సహా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంతేకాకుండా, కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఆదేశించారు.
అనర్హులైన వారిని గుర్తించేందుకు తదుపరి పరిశీలనలు జరుగుతాయని తెలిపారు.
సంక్షేమ వ్యవస్థ సమగ్రతను కాపాడుతూ అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించడంపై మరింత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇలాంటి మోసాలను అరికట్టడానికి వివిధ స్థాయిల్లో తనిఖీలు కొనసాగిస్తామని కూడా ఆయన తెలిపారు.