LOADING...
Kailash Yatra row: కైలాస మానస సరోవర యాత్ర మార్గంపై భారత్-నేపాల్ మధ్య మళ్లీ సరిహద్దు వివాదం
కైలాస మానస సరోవర యాత్ర మార్గంపై భారత్-నేపాల్ మధ్య మళ్లీ సరిహద్దు వివాదం

Kailash Yatra row: కైలాస మానస సరోవర యాత్ర మార్గంపై భారత్-నేపాల్ మధ్య మళ్లీ సరిహద్దు వివాదం

వ్రాసిన వారు Sirish Praharaju
May 04, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

కైలాస మానస సరోవర యాత్ర నేపథ్యంలో భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మరోసారి ముదిరింది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ కనుమ మార్గాన్ని యాత్ర కోసం వినియోగించడాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ ప్రాంతం తమ భూభాగమని, తమ అనుమతి లేకుండా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆదివారం కాఠ్మండూలో నేపాల్ విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వివరాలు 

ఏమిటి వివాదం?

కైలాస మానస సరోవర యాత్ర-2026ను జూన్ నుంచి ఆగస్టు మధ్య నిర్వహించనున్నట్లు భారత విదేశాంగ శాఖ ఇటీవల వెల్లడించింది. సిక్కింలోని నాథూ లా, ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గాల ద్వారా యాత్ర కొనసాగుతుందని తెలిపింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే, ఈ నిర్ణయంపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమతో చర్చించకుండా, తమ భూభాగంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా భారత్, చైనా దేశాల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది.

వివరాలు 

భారత్ స్పందన

నేపాల్ అభ్యంతరాలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ, లిపులేఖ్ అంశంపై తమ స్థానం స్పష్టమని పేర్కొంది. 1954 నుంచి కైలాస యాత్ర కోసం ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నామని, ఇది కొత్త విషయం కాదని తెలిపింది. నేపాల్ ప్రాదేశిక వాదనలకు చారిత్రక ఆధారాలు లేవని, ఏకపక్షంగా సరిహద్దులను విస్తరించుకోవడం సమంజసం కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. అయితే, సరిహద్దు వివాదాలతో సహా అన్ని ద్వైపాక్షిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

నేపథ్యం

1816లో జరిగిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాళీ నదికి తూర్పున ఉన్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తోంది. అయితే, 2020లో లిపులేఖ్ కనుమ వరకు భారత్ 80 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించడంతో ఈ వివాదం మరింత తీవ్రతరమైంది. అప్పటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఈ మూడు ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపిస్తూ కొత్త రాజకీయ పటాన్ని విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతోంది.

Advertisement