Rain Alert : బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాల సూచన!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలు మళ్లీ ఇబ్బందులు పెడుతున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. మొంథా ప్రభావం తగ్గి, ప్రజలు కాస్త ఊపిరి పీలుస్తున్న తరుణంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం కురిసింది. దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రివేళల వరకు చెదురుమదురు వర్షాలు నమోదయ్యాయి.
Details
వర్షాల ప్రభావం తెలంగాణపై పడే ప్రభావం
హైదరాబాద్ నగరంలోనూ రాత్రి వర్షం దంచికొట్టింది. పలు కాలనీలు నీటమునిగిపోయాయి. రహదారులు జలమయమై, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తూర్పు విదర్భ, దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అది మరింత బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారినప్పటికీ, దాని ప్రభావం వర్షాల రూపంలో తెలంగాణపై పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ కారణంగా రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో గాలివానలు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సిద్ధిపేట జిల్లాల్లో ఎక్కువగా వర్షాల ప్రభావం ఉండనుంది.