Navy: దేశ రక్షణకు నూతన శక్తి.. కొత్తగా 3 యుద్ధ నౌకలు చేరిక!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వరంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించిన మూడు అత్యాధునిక నౌకలు - దునగిరి, సంశోధక్, ఆగ్రే - సోమవారం Indian Navyలో చేరాయి. వీటి చేరికతో నావికాదళ శక్తి, సామర్థ్యాలు మరింత బలపడనున్నాయి. దునగిరి నౌక నీలగిరి తరగతికి చెందినది. 1977 నుంచి 2010 వరకు సేవలందించిన పాత ఐఎన్ఎస్ దునగిరికి బదులుగా, ప్రాజెక్ట్-17ఏ కింద ఈ నూతన నౌకను నిర్మించారు. బ్రహ్మోస్ క్షిపణులు, రాకెట్లు, టోర్పెడోలను ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉంది. డిజైన్, దాడి సామర్థ్యం, ఆటోమేషన్, నిఘా వ్యవస్థలు, స్వావలంబన వంటి అంశాల్లో ఈ నౌక అత్యుత్తమంగా ఉందని నేవీ వెల్లడించింది.
వివరాలు
పాత ఐఎన్ఎస్ ఆగ్రేకు బదులుగా ఈ కొత్త నౌక
సంశోధక్ నౌక ప్రధానంగా సర్వే బాధ్యతలు నిర్వహించేందుకు రూపొందించారు. తీరప్రాంతాల్లో గస్తీ కాయడంతో పాటు నౌకాశ్రయాల వద్ద సముద్ర లోతులను నిరంతరం పరిశీలిస్తుంది. రక్షణ అవసరాలతో పాటు పౌర వినియోగానికి సంబంధించిన ఒషనోగ్రాఫిక్, జియోఫిజికల్ సమాచారాన్ని అందించగలదు. ఇందులో డిజిటల్ సైడ్ స్కాన్ సోనార్, ఆటానమస్ అండర్వాటర్ వెహికల్, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ వంటి ఆధునిక సదుపాయాలున్నాయి. ఆగ్రే నౌక అర్నానా తరగతికి చెందిన యాంటీ-సబ్మెరైన్ యుద్ధ నౌక. 2017లో సేవల నుంచి విరమించిన పాత ఐఎన్ఎస్ ఆగ్రేకు బదులుగా ఈ కొత్త నౌకను నిర్మించారు. ఈ మూడు నౌకల చేరికతో భారత నావికాదళానికి సముద్ర భద్రతలో మరింత బలమైన మద్దతు లభించనుంది.