LOADING...
Telangana News: మహబూబ్‌నగర్‌- గూడెబల్లూరు నాలుగు లైన్ల విస్తరణకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు
మహబూబ్‌నగర్‌- గూడెబల్లూరు నాలుగు లైన్ల విస్తరణకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు

Telangana News: మహబూబ్‌నగర్‌- గూడెబల్లూరు నాలుగు లైన్ల విస్తరణకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహబూబ్‌నగర్‌ నుంచి రాయచూరు వరకు (ఎన్‌హెచ్‌-167) రహదారి అభివృద్ధికి మరో కీలక అడుగు పడబోతోంది. హైదరాబాద్‌-పనాజీ జాతీయ రహదారి విభాగం పరిధిలోని ఈ మార్గానికి త్వరలోనే మహర్దశ రానుంది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తుది నిర్ణయం తీసుకుంది. మహబూబ్‌నగర్‌ నుంచి కర్ణాటక సరిహద్దులోని గూడెబల్లూరు (రాయచూరుకు సమీపం) వరకు 80.01 కిలోమీటర్ల దూరం ఈ ప్రాజెక్టులో భాగమవుతుంది. రూ.2,278.38 కోట్ల అంచనాతో ఈ విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎన్‌హెచ్‌ఏఐ గురువారం అధికారికంగా టెండర్లు ఆహ్వానించింది. టెండర్‌ దక్కించుకునే సంస్థ ఈ రహదారిని హ్యామ్‌ (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) విధానంలో నిర్మించనుంది.

వివరాలు 

రూ.100 కోట్ల వరకు పరిహారం జమ

ఈ పద్ధతిలో నిర్మాణ వ్యయం ముందుగా ప్రభుత్వం నుంచి కొంత భాగం లభించగా, మిగతా మొత్తాన్ని టోల్‌ గేట్ల ద్వారా వాహనదారుల నుంచి వసూలు చేస్తారు. ఈ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోతున్న బాధితులకు పరిహారం కింద సుమారు రూ.100 కోట్ల వరకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌ వైపుల నుంచి గోవా, రాయచూరు, మంత్రాలయం వంటి ప్రాంతాలకు, అలాగే కర్ణాటకలోని పలు పట్టణాలకు ప్రయాణించే వారు సాధారణంగా జడ్చర్ల-మహబూబ్‌నగర్‌ మార్గాన్ని ఉపయోగిస్తారు. ఈ రహదారి నాలుగు వరుసలుగా విస్తరించాక ప్రయాణం మరింత సులభం, వేగవంతం కానుందని అధికారులు వెల్లడించారు.