NIA: పహల్గామ్ ఉగ్రవాద దాడితో సంబంధం ఉన్న గోప్రో కెమెరా.. చైనా సాయం కోరనున్న ఎన్ఐఏ
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు కొత్త దశలోకి వెళ్లింది. ఈ ఘటనలో ఉగ్రవాదులు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. దాడి సమయంలో 'గో ప్రో' కెమెరాలు ఉపయోగించినట్లు తేలడంతో, వాటి కొనుగోలు-వినియోగ వివరాల కోసం చైనా అధికారులను సంప్రదించేందుకు ఎన్ఐఏ సిద్ధమవుతోంది. ఇందుకు జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
వివరాలు
గో ప్రో కెమెరాలు స్వాధీనం
ఘటనా ప్రదేశంలో నిర్వహించిన సోదాల్లో గో ప్రో హీరో 12 బ్లాక్ మోడల్కు చెందిన కెమెరాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడికి ముందు ఉగ్రవాదుల కదలికలు, వ్యూహరచన, ప్రణాళికలపై స్పష్టత పొందేందుకు ఈ కెమెరాల్లోని డేటా కీలక ఆధారాలుగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్లో ఈ ఉగ్రదాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చైనాలో యాక్టివేషన్ దర్యాప్తులో భాగంగా, ఈ గో ప్రో కెమెరాలు దాడికి ఏడాది ముందే చైనాకు చెందిన ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 జనవరి 30న చైనాలోని డోంగ్వాన్ నగరంలో ఈ పరికరాలు యాక్టివేట్ అయినట్లు సమాచారం సేకరించారు.
వివరాలు
లావాదేవీలపై సందేహాలు
కెమెరాల తయారీ సంస్థ గో ప్రోబీవీకి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అయితే, సంబంధిత లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని తయారీదారు సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఈ కెమెరాలను అసలు ఎవరు కొనుగోలు చేశారు? చివరిసారిగా ఎవరు వినియోగించారు? అన్న అంశాలపై స్పష్టత కోసం చైనా సహకారం కోరాలని నిర్ణయించింది. ఈ మేరకు చైనా న్యాయశాఖ అధికారులకు అధికారిక లేఖ పంపేందుకు ఎన్ఐఏ సిద్ధమవుతోంది. దీనికి హోంమంత్రిత్వశాఖ నుంచి ఇప్పటికే అనుమతులు కూడా లభించాయి.