Nitish Kumar: ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాజకీయాల్లో కీలక నేతగా పేరుగాంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నెలలో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒకేసారి రెండు సభల్లో సభ్యత్వం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నియమాల ప్రకారం 14రోజుల లోపు ఒక పదవిని వదులుకోవాల్సి ఉండగా,ఆ గడువు ముగియబోతున్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవిని వీడారు. తాజా సమాచారం ప్రకారం, నితీశ్ కుమార్ ఏప్రిల్ 9న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. నితీశ్ కుమార్ రాజకీయ ప్రయాణం విశ్లేషకుల దృష్టిలో ప్రత్యేకమైనది. ఇప్పటివరకు పది సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కెరీర్ను "కూటమి రాజకీయాల్లో మాస్టర్ క్లాస్"గా అభివర్ణిస్తారు.
వివరాలు
రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తి
1985లో ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 2005లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నితీశ్,ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. అయితే 2013 తర్వాత ఆయన రాజకీయ జీవితం వరుస కూటమి మార్పులతో సాగింది.
వివరాలు
బీహార్ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులకు అవకాశం
ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూటమి,మహాఘటబంధన్ (RJD, కాంగ్రెస్) మధ్య ఆయన అనేకసార్లు తన మద్దతును మార్చుకున్నారు. 2013, 2017, 2022, 2024 సంవత్సరాల్లో జరిగిన ఈ మార్పులు ఆయన రాజకీయ వ్యూహాలకు నిదర్శనం. ఇప్పటికీ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారా లేదా అన్న అంశంపై స్పష్టత రాలేదు. ఈ పరిణామాలు బీహార్ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.