Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ !
ఈ వార్తాకథనం ఏంటి
జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ (X) పోస్టు ద్వారా వెల్లడించారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన పోస్టులో నీతీశ్ కుమార్ మాట్లాడుతూ, "గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై విశ్వాసం ఉంచి నాకు నిరంతరం మద్దతు ఇచ్చారు. ఆ నమ్మకానికి తగిన విధంగా నేను అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను. మీ ఆదరణ, విశ్వాసం వల్లే బిహార్ అభివృద్ధి కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది" అని తెలిపారు.
వివరాలు
బిహార్కు త్వరలో కొత్త ముఖ్యమంత్రి
"నా పార్లమెంటరీ రాజకీయ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచే ఒక ఆశయం ఉంది.రాష్ట్ర స్థాయిలో రెండు చట్టసభలకు, అలాగే పార్లమెంట్లోని రెండు సభలకు ప్రాతినిధ్యం వహించాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను" అని వివరించారు. "కొత్త బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా బిహార్ రాష్ట్రంతో నా అనుబంధం అలాగే కొనసాగుతుంది. రాబోయే ప్రభుత్వానికి నేను సంపూర్ణ సహకారం అందిస్తాను" అని నీతీశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బిహార్కు త్వరలో కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ ముఖ్యమంత్రి పదవి భారతీయ జనతా పార్టీ (భాజపా)కి దక్కే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.