Omicron RF.5: ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5పై ఆందోళన వద్దు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం
ఈ వార్తాకథనం ఏంటి
ఒమిక్రాన్ ఉపవేరియంట్ ఆర్ఎఫ్.5 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏ) స్పష్టం చేసింది. ఇది కొత్తగా ఉద్భవించిన అసాధారణ కొవిడ్ వేరియంట్ కాదని, ఇప్పటికే ప్రపంచంలోని 20కి పైగా దేశాల్లో గుర్తించబడిందని వెల్లడించింది. ఏపీజీడీఏ వివరాల ప్రకారం, గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయెంజా డేటా (GISAID)లో ఇప్పటివరకు ఆర్ఎఫ్.5కు సంబంధించిన సుమారు 470 జీనోమ్ సీక్వెన్స్లు నమోదయ్యాయి. ఈ వేరియంట్ తొలిసారిగా 2025 ఆగస్టులో గుర్తించబడిందని తెలిపింది.
వివరాలు
ఈ లక్షణాలు కనిపిస్తే ద్యులను సంప్రదించాలి
ప్రజలు భయాందోళనలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.
బయటకు వెళ్లే సమయంలో మాస్క్లు ధరించడం, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అవసరమైనప్పుడు శానిటైజర్ వినియోగించడం మంచిదన్నారు.
దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే స్వీయ చికిత్సకు పాల్పడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఈ సూచనలను ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన ప్రచార పత్రాన్ని ఏపీజీడీఏ విడుదల చేసింది.
వివరాలు
రాజమహేంద్రవరంలో కొవిడ్ కేసు నమోదు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ఒక కొవిడ్ కేసు నమోదైంది.
కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 21 ఏళ్ల యువకుడు ప్రస్తుతం రాజమహేంద్రవరంలో నివసిస్తున్నాడు.
నాలుగు రోజుల క్రితం ఓ పుట్టినరోజు వేడుకకు హాజరైన అతడికి, గత మూడు రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు లక్షణాలు కనిపించాయి.
ఆదివారం జీజీహెచ్లో నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షలో అతడికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.
అనంతరం వైద్యులు ప్రత్యేక వార్డులో చేర్చి, నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షకు నమూనాలు సేకరించారు.
ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, జ్వరం కూడా తగ్గిందని వైద్యులు వెల్లడించారు.