Hyderabad: మార్కెట్టే కాదు.. హైదరాబాద్ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం
ఈ వార్తాకథనం ఏంటి
మోజంజాహి మార్కెట్ నగరంలోని ప్రముఖ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. గత చరిత్రను, నేటి అవసరాలను అద్భుతంగా మేళవించిన ఈ నిర్మాణం గత 90 ఏళ్లుగా హైదరాబాద్ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి), రెసిడెన్సీ (కోఠి) ప్రాంతాల మధ్య ఒక ప్రధాన వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 1933 నుంచి 1935 మధ్య ఈ మార్కెట్ను నిర్మించారు. తన రెండో కుమారుడు మొఅజ్జం జా బహదూర్ పేరుమీదుగా ఈ మార్కెట్కు 'మొజంజాహి మార్కెట్'గా నామకరణం చేశారు. సుమారు 1.77 ఎకరాల విస్తీర్ణంలో త్రిభుజాకారంలో ఇండో-సార్సెనిక్ శైలిలో నిర్మించిన ఈ కట్టడం ప్రారంభంలో పండ్ల మార్కెట్గా ప్రాచుర్యం పొందింది.
వివరాలు
నాలుగు తరాలుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నాం
గ్రే గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ భవనం గుమ్మటాలు, అందమైన తోరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ మార్కెట్కు ప్రధాన గుర్తింపు ఇచ్చేది ఎత్తైన గడియార స్తంభం. కాలం మారినా, తరాలు గడిచినా ఈ మార్కెట్ను నమ్ముకుని జీవనోపాధి కొనసాగిస్తున్న వ్యాపారులు ఇంకా ఉన్నారు. కూరగాయల వ్యాపారి గంగారాం మాట్లాడుతూ, "గత 85 ఏళ్లుగా మా కుటుంబం నాలుగు తరాలుగా ఇక్కడే వ్యాపారం చేస్తోంది. రెండేళ్ల క్రితం నిజాం మనవడు హైదరాబాద్ వచ్చినప్పుడు మా దుకాణాన్ని సందర్శించి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారని తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ చారిత్రక కట్టడం మరొకసారి చరిత్రను స్మరింపజేస్తోంది.