
Odisha: జగన్నాథుని ఆదాయం పెంచేందుకు సన్నాహాలు.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో హుండీలు
ఈ వార్తాకథనం ఏంటి
పూరీ జగన్నాథునికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్నారు. స్వామి ఆలయానికి భూములు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో తిరుమల తరహాలో భక్తులకు ఉచిత వసతి, తీర్థప్రసాదాలు వంటి సౌకర్యాలు అందించాలన్న దృష్టితో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ముఖ్యంగా ఆలయ కార్పస్ ఫండ్ను పెంచే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. న్యాయశాఖ ఈ దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.
వివరాలు
మూడు సంవత్సరాల్లో రూ.113 కోట్ల విరాళం
గత మూడేళ్ల కాలంలో భక్తులు నగదు రూపంలో పూరీ జగన్నాథునికి మొత్తం రూ.113 కోట్ల విరాళాలు సమర్పించారు.
ఈ మొత్తం శ్రీక్షేత్రంలోని హుండీ లలో, బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ రూపంలో వచ్చిన ఆదాయం.
అయితే భక్తుల సంఖ్య గణనీయంగా ఉన్నా, ఉన్న నిధులు సరిపోక ఉచితంగా ఒబడా (మహాప్రసాదం) అందరికీ పంచడం సాధ్యపడడం లేదు.
రథయాత్ర తర్వాత కీలక సమావేశం
ఈ సమస్యల పరిష్కారానికి దోహదపడేలా,రథయాత్ర అనంతరం ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి దేశంలోని వివిధ బ్యాంకుల అధిపతులతో సమావేశం నిర్వహించనున్నారు.
జగన్నాథుని పేరిట అన్ని శాఖల్లో డిజిటల్ హుండీలు ఏర్పాటు చేయడం, ప్రతి ప్రాంతంలో క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
వివరాలు
ఆశాభావంతో ఉన్నాం
ఇప్పటికే న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల్లో ఉన్న ఉన్నతాధికారులకు లేఖలు రాసి ముఖ్యమంత్రితో సమావేశానికి సమయం కేటాయించాలని కోరారు.
పూరీ నగరంలో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడిన న్యాయశాఖ మంత్రి హరిచందన్, "భక్తులకు అన్నిరకాల సదుపాయాలు అందిస్తూ,శ్రీక్షేత్ర వైభవాన్ని పెంచడం మా లక్ష్యం. దీనికోసం అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించడమే ప్రధానమైన దశ" అని తెలిపారు.
ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు.
వివరాలు
రథయాత్ర ముగిసిన తర్వాత బ్యాంకర్లతో సమావేశం
దేశవ్యాప్తంగా జరిగే పండుగల సమయంలో భక్తులు జగన్నాథుడికి మొక్కుబడులు సమర్పించే సందర్భాల్లో, ఆయా ప్రాంతాల్లో బ్యాంకుల సహకారంతో డిజిటల్ హుండీలు ఏర్పాటు చేస్తే ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
రథయాత్ర అనంతరం బ్యాంకర్లతో జరిగే సమావేశం ద్వారా ఈ ప్రణాళికలు మరింతగా ముందుకు కదిలే అవకాశముందని పేర్కొన్నారు.