Page Loader
Mohan Yadav: రాజకీయాల్లోకి వచ్చిన 10ఏళ్లకే వరించిన సీఎం పదవి
Mohan Yadav: రాజకీయాల్లోకి వచ్చిన 10ఏళ్లకే వరించిన సీఎం పదవి

Mohan Yadav: రాజకీయాల్లోకి వచ్చిన 10ఏళ్లకే వరించిన సీఎం పదవి

వ్రాసిన వారు Stalin
Dec 11, 2023
08:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

వారం రోజుల సస్పెన్స్ తర్వాత మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ (58)ని భారతీయ జనతా పార్టీ (BJP) సోమవారం ఎన్నుకుంది. జగదీష్ దేవదా, రాజేంద్ర శుక్లా ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు. సీనియర్ నేత నరేంద్ర సింగ్ తోమర్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా నియమించారు. ఎంతోమంది సీనియర్లు ఉన్నా.. ముందు రేసులో ఉన్న వారి జాబితాలో ఆయన పేరు లేకపోయినా.. అనూహ్యంగా 10ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎంపిక చేయడం అందరినీ ఆశ్యర్యం కలిగించింది. రాజకీయ వ్యూహంలో భాగంగానే మోహన్ యాదవ్‌ను సీఎంగా బీజేపీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లోని యాదవులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బీజేపీ

మోహన్ యాదవ్ పేరును ప్రతిపాదించిన శివరాజ్ సింగ్ 

మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవి రేసులో పలువురు అనుభవజ్ఞుల పేర్లు వినిపించాయి. వీరిలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, మాజీ కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కైలాష్ విజయవర్గీయ పేర్లు వినిపించాయి. కానీ, వీరిని కాదని బీజేపీ అధిష్ఠానం మోహన్ యాదవ్‌వైపు మొగ్గు చూపింది. వాస్తవానికి మోహన్ యాదవ్ పేరును శాసనసభా పక్ష సమావేశంలో శివరాజ్ స్వయంగా ప్రతిపాదించినట్లు సమాచారం. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా యాదవ్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2013, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయ సాధించారు. ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చిన 10ఏళ్లకే మోహన్ యాదవ్ సీఎం కావడం గమనార్హం.

బీజేపీ

మోహన్ యాదవ్ ప్రస్థానం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మార్చి 25, 1965న జన్మించిన యాదవ్.. విక్రమ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో యాదవ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. మోహన్ యాదవ్‌కు విద్యార్థి దశ నుంచే బీజేపీతో అనుబంధం ఉంది. 1982లో ఏబీవీపీ సహాయ కార్యదర్శిగా పనిచేశారు. 2013లో మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి పోటీ చేసి ఈ స్థానం నుంచి వరుసగా 3 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. అతను మధ్యప్రదేశ్ డెవలప్‌మెంట్ అథారిటీకి చీఫ్‌గా, పశ్చిమ రైల్వే బోర్డులో సలహా కమిటీ సభ్యునిగా కూడా ఉన్నారు. జూలై 2, 2020న శివరాజ్ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు.