ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు
సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కున్న భారతీయులను రక్షించడానికి కేంద్రం 'ఆపరేషన్ కావేరి'ని ముమ్మరం చేసింది. తాజాగా ఎనిమిది, తొమ్మిది, పదవ బ్యాచ్లు సూడాన్ నుంచి బయలుదేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి సూడాన్ సైన్యం, రాపిడ్ సపోర్ట్ సోల్జర్స్(ఆర్ఎస్ఎఫ్) మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే 500 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో సూడన్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే పనిలో విదేశాంగశాఖ నిమగ్నమైంది. 135మంది భారతీయ పౌరులతో కూడిన 10వ బ్యాచ్ పోర్ట్ సూడాన్ నుంచి ఐఏఎఫ్ సీ130జే విమానంలో విజయవంతంగా బయలుదేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
8వ బ్యాంచ్ తరలింపు సాహసోపేతమైన చర్యగా పేర్కొన్న మురళీధరన్
9వ బ్యాచ్లో 326 మంది, 8వ బ్యాంచ్లో 121 మంది భారతీయులు ఐఏఎఫ్ సీ130జే విమానంలో బయలుదేరారని బాగ్చి ట్వీట్లో వెల్లడించారు. ముఖ్యంగా 8వ బ్యాంచ్ తరలింపు సాహసోపేతమైన చర్యగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అభివర్ణించారు. 121 మంది భారతీయులతో కూడిన ఐఏఎఫ్ సీ130జే విమానం సుడాన్లోని వాడి సెయిడ్నా నుంచి బయలుదేరింది. అయితే ఈ ప్రాంతం ఖార్టూమ్కు సమీపంలో ఉన్నందున ఈ తరలింపు మరింత క్లిష్టంగా మారిందిని చెప్పారు. ఎంబసీ అధికారుల కుటుంబ సభ్యులు కూడా ఈ బృందంలో ఉన్నట్లు మురళీధరన్ చెప్పారు. సూడాన్ నుంచి నేరుగా రవాణాకు అవకాశం లేనందున సౌదీ అరేబియా నగరమైన జెడ్డా మీదుగా విదేశాంగ శాఖ భారతీయుల తరలింపును చేపడుతోంది.