Delhi Air Pollution: దిల్లీ వాయు కాలుష్యంలో పాక్ వాటా 33 శాతం.. నివేదికలో సంచలన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తుండగా.. ఈ సమస్యకు పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా ఓ ప్రధాన కారణంగా నిలుస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. దిల్లీ నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న పీఎం 2.5 ధూళికణాల్లో ఏటా దాదాపు 33 శాతం పాకిస్థాన్ నుంచి సరిహద్దులు దాటి వస్తున్నట్లు తెలిపింది. పంజాబ్లో వాయు కాలుష్యం పెరగడంలోనూ పాక్ నుంచి వచ్చే కాలుష్య కణాలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొంది. 'బియాండ్ స్టేట్ బౌండరీస్: క్వాంటిఫైయింగ్ ఇంటర్స్టేట్ ఎయిర్ పొల్యూషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ సెక్టోరల్ సొల్యూషన్స్ ఇన్ ది ఇండో-గ్యాంగేటిక్ ప్లెయిన్' పేరుతో సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్టీఈపీ) తాజాగా నివేదికను విడుదల చేసింది.
వివరాలు
స్థానిక కాలుష్యం వాటా 28 శాతమే
ఇందులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో గాలిలోని కాలుష్య కణాల రవాణాపై పలు కీలక అంశాలను వెల్లడించింది.
నివేదిక ప్రకారం.. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో పీఎం 2.5 ధూళికణాల వార్షిక సగటు గాఢత ఒక్కో క్యూబిక్ మీటర్కు 67.9 మైక్రోగ్రాములుగా నమోదవుతోంది.
అయితే ఇందులో స్థానిక వనరుల నుంచి వెలువడే పీఎం 2.5 ధూళికణాల వాటా కేవలం 28 శాతమేనని నివేదిక తెలిపింది.
ఎన్సీఆర్లో స్థానికంగా వెలువడే కాలుష్యానికి ప్రధానంగా ఇళ్లలో జరిగే వివిధ కార్యకలాపాలు, వ్యవసాయ పనులు, వాహనాల రాకపోకలు, పారిశ్రామిక కార్యకలాపాలు కారణమవుతున్నాయి.
వీటితో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా కాలుష్య కణాలు ఎన్సీఆర్లోకి చేరుతున్నాయి.
వివరాలు
పంజాబ్కూ తప్పని కాలుష్య ముప్పు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పీఎం 2.5 ధూళికణాల వాటా 12 శాతంగా ఉండగా.. పాకిస్థాన్ నుంచి సరిహద్దులు దాటి వచ్చే వాటా ఏకంగా 33 శాతంగా ఉన్నట్లు సీఎస్టీఈపీ నివేదిక పేర్కొంది.
అంటే ఎన్సీఆర్లో నమోదవుతున్న పీఎం 2.5 కాలుష్యంలో స్థానిక వనరుల కంటే పాక్ నుంచి వచ్చే కాలుష్య కణాల వాటా ఎక్కువగా ఉందని నివేదిక గణాంకాలు సూచిస్తున్నాయి.
పంజాబ్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
రాష్ట్రంలో పీఎం 2.5 ధూళికణాల వార్షిక సగటు గాఢత ఒక్కో క్యూబిక్ మీటర్కు 77.8 మైక్రోగ్రాములుగా ఉంది.
ఇందులో దాదాపు 40 శాతం పీఎం 2.5 కాలుష్య కణాలు పాకిస్థాన్ నుంచి పంజాబ్లోకి చేరుతున్నట్లు అధ్యయనం తెలిపింది.
వివరాలు
వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం కూడా పంజాబ్ వాయు కాలుష్యానికి కారణం
పంజాబ్లో స్థానికంగా వెలువడే కాలుష్యంలో నివాస రంగానికి చెందిన కార్యకలాపాల వాటా అత్యధికంగా ఉంది.
రాష్ట్రంలోని స్థానిక పీఎం 2.5 కాలుష్యంలో 52 శాతం మేర ఇళ్లలో జరిగే కార్యకలాపాలే కారణమవుతున్నాయి.
ఆ తర్వాత పారిశ్రామిక కార్యకలాపాలు 13.8 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్నాయి.
వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం కూడా పంజాబ్ వాయు కాలుష్యానికి కారణమవుతోంది.
పంట వ్యర్థాల దహనం వల్ల రాష్ట్రంలోని పీఎం 2.5 కాలుష్యంలో 7.9 శాతం వాటా ఏర్పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
వివరాలు
పొరుగు ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే కాలుష్య కణాలు కూడా కీలక కారణం
ఇక పాకిస్థాన్తో పాటు రాజస్థాన్, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) నుంచి కూడా కాలుష్య కణాలు పంజాబ్లోకి చేరుతున్నట్లు సీఎస్టీఈపీ అధ్యయనం వెల్లడించింది.
దీంతో గాలి కాలుష్య సమస్యకు రాష్ట్ర సరిహద్దులు మాత్రమే కాకుండా.. పొరుగు ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే కాలుష్య కణాలు కూడా కీలక కారణంగా మారుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.