Pawan Kalyan: చెత్త నుంచి కరెంట్.. 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ను పరిశీలించిన పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయుడుపేటలోని జిందాల్ 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ను సందర్శించారు. చెత్తను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఈ ప్లాంట్ పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ ఏర్పాటు కోసం అయిన వ్యయం, నిర్వహణ ఖర్చులు తదితర అంశాలపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అలాగే ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ పరిమాణం, ఒక్కో యూనిట్ విక్రయ ధరల గురించి కూడా జిందాల్ ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా కాకినాడలో ఏర్పాటు చేసిన జిందాల్ 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ ఇప్పటికీ ఎందుకు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని ఉపముఖ్యమంత్రి ప్రశ్నించారు.
వివరాలు
ఈ ఏడాది నవంబర్ నాటికి అందుబాటులో
దీనికి స్పందించిన సంస్థ ప్రతినిధులు, ఆ ప్లాంట్ను ఈ ఏడాది నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై కూడా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వల్ల ఏర్పడే కాలుష్యం, దానిని నియంత్రించేందుకు చేపడుతున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని జిందాల్ ప్రతినిధులను కోరారు. దీనికి స్పందించిన సంస్థ ప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి (PCB) ప్రతి ఏడాది నాలుగు సార్లు తనిఖీలు నిర్వహించి నివేదికలు అందజేస్తోందని ఉపముఖ్యమంత్రికి వివరించారు.