Kolusu Parthasarathy: వైసీపీ నుండి మరో ఎమ్యెల్యే ఔట్ .. ఈ నెల 18న టిడిపిలోకి..
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి త్వరలో టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో టిడిపి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టిడిపి నేత బొమ్మసాని సుబ్బారావులు పార్థసారథిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న రా కదలి రా బహిరంగ సభలో ఆయన టీడీపీలో చేరతారని కూడా వార్తలు వస్తున్నాయి.
పెనమలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
వైసీపీలో గుర్తింపు రాకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవల పోరంకిలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ టిక్కెట్టు రాకుంటే పెనమలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు.