LOADING...
Air India: ఎయిర్ ఇండియా AI171 ప్రమాదంపై కొత్త సందేహాలు.. RAT వ్యవస్థ,ఘటనల క్రమంపై మళ్లీ దర్యాప్తు కోరిన పైలట్ల సంఘం
RAT వ్యవస్థ,ఘటనల క్రమంపై మళ్లీ దర్యాప్తు కోరిన పైలట్ల సంఘం

Air India: ఎయిర్ ఇండియా AI171 ప్రమాదంపై కొత్త సందేహాలు.. RAT వ్యవస్థ,ఘటనల క్రమంపై మళ్లీ దర్యాప్తు కోరిన పైలట్ల సంఘం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై తాజాగా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో కొన్ని కీలక అంశాలపై స్పష్టత లేదని పేర్కొంటూ భారతీయ పైలట్ల సమాఖ్య (Federation of Indian Pilots-FIP) విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB)కు లేఖ రాసింది. ముఖ్యంగా విమానంలోని అత్యవసర వ్యవస్థ అయిన రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) పనిచేసిన సమయం, ఇంధన సరఫరా నిలిచిపోయిన ఘటనతో దాని సంబంధంపై మరోసారి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరింది.

వివరాలు 

ఇంధన సరఫరా ఆగిన దాదాపు 18సెకన్ల తర్వాత RAT విద్యుత్ ఉత్పత్తి చేయడం మొదలవుతుంది 

AAIB విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం,ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లో మార్పులు జరిగిన తర్వాత RAT వ్యవస్థ పనిచేయడం ప్రారంభించిందని పేర్కొంది. అయితే,బోయింగ్ 787 విమాన సిమ్యులేటర్ పరీక్షల ప్రకారం ఇంధన సరఫరా ఆగిన దాదాపు 18సెకన్ల తర్వాత RAT విద్యుత్ ఉత్పత్తి చేయడం మొదలవుతుందని FIP తెలిపింది. కానీ నివేదికలో కేవలం 4 నుంచి 5సెకన్ల వ్యవధిలోనే ఈ ప్రక్రియ జరిగినట్లు పేర్కొనడం సందేహాలకు తావిస్తోందని అభిప్రాయపడింది. పైలట్ల సంఘం వాదన ప్రకారం,RAT వ్యవస్థ ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్ల కాకుండా, ముందుగానే ఏర్పడిన విద్యుత్ లేదా ఇతర సాంకేతిక లోపం కారణంగా పనిచేసి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అంశాన్ని నిర్ధారించేందుకు కొత్తగా సిమ్యులేటర్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

వివరాలు 

టేకాఫ్‌కు ముందే ACARS ద్వారా నిర్వహణకు సంబంధించిన పలు హెచ్చరిక సందేశాలు

అహ్మదాబాద్ విమానాశ్రయంలోని సీసీటీవీ దృశ్యాలను కూడా FIP తన లేఖలో ప్రస్తావించింది. విమానం టేకాఫ్‌కు ముందు రన్‌వేపైనే ఉండగా RAT ఇప్పటికే బయటకు వచ్చినట్లు కనిపిస్తోందని, ఇది ముందస్తు సాంకేతిక సమస్యకు సంకేతం కావచ్చని పేర్కొంది. ప్రమాదానికి ముందు జరిగిన పలు సంఘటనలను కూడా సమగ్రంగా పరిశీలించాలని పైలట్ల సంఘం కోరింది. పెద్ద పేలుడు వంటి శబ్దం వినిపించడం, విమానంలోని లైట్లు ఒక్కసారిగా మందగించడం, టేకాఫ్‌కు ముందే ACARS ద్వారా నిర్వహణకు సంబంధించిన పలు హెచ్చరిక సందేశాలు పంపబడటం వంటి అంశాలను ఒకే కోణంలో విశ్లేషించాలని సూచించింది. అలాగే విమానం వెనుక భాగంలోని ఫ్లైట్ రికార్డర్‌కు సంబంధించిన నష్టాన్ని కూడా పరిశీలించి ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలను గుర్తించాలని పేర్కొంది.

Advertisement

వివరాలు 

ఎయిర్ ఇండియా AI171 ప్రమాదంలో 260 మంది మృతి 

ప్రాథమిక నివేదికలో పొందుపరిచిన వేగం, ఘటనల సమయ క్రమం వంటి వివరాలను స్వతంత్రంగా మరోసారి పరిశీలించాలని FIP డిమాండ్ చేసింది. RAT వ్యవస్థ, హైడ్రాలిక్ పవర్ ఉత్పత్తి, ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా విశ్లేషించి తుది దర్యాప్తు నివేదికలో స్పష్టమైన వివరాలు వెల్లడించాలని కోరింది. గత ఏడాది జరిగిన ఎయిర్ ఇండియా AI171 ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో పాటు నేలపై ఉన్నవారితో కలిపి మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో పైలట్ల సంఘం లేవనెత్తిన తాజా సందేహాలు ప్రమాద దర్యాప్తుపై మరోసారి చర్చకు దారితీశాయి.

Advertisement