PM Modi: కాంగ్రెస్ దేశాన్ని వెనక్కి నెట్టింది..'హిందూ గ్రోత్ రేట్'పై మోదీ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని నిస్సహాయత, పేదరికం, ఆత్మన్యూనత భావంలోకి కాంగ్రెస్ నెట్టేసిందని ఆరోపించారు. అంతేకాకుండా, దేశంలో నెమ్మదిగా జరిగిన ఆర్థిక వృద్ధికి "హిందూ గ్రోత్ రేట్" అనే పేరు పెట్టడం ద్వారా హిందూ సమాజంపై అనవసరమైన ముద్ర వేశారని విమర్శించారు. భారతదేశంలో అత్యధిక కాలం నిరవధికంగా ఎన్నికైన ప్రధానిగా కొనసాగిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఎన్డీయే 12 ఏళ్ల పాలనలో సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి కాంగ్రెస్ పాలన వారసత్వం నుంచి దేశాన్ని విముక్తి చేయడమేనని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
"హిందూ గ్రోత్ రేట్"
కాంగ్రెస్ పాలనలో భారత్ వేగంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. దేశంలో అభివృద్ధి చాలా నెమ్మదిగా జరుగుతుందనే వాదనకు "హిందూ గ్రోత్ రేట్" అనే పేరు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. "పాలన కాంగ్రెస్ది, బాధ్యత కాంగ్రెస్ది, వైఫల్యం కాంగ్రెస్ది. కానీ ఆ అపఖ్యాతిని దేశంలోని హిందూ సమాజంపై మోపారు. నిజానికి దానికి 'కాంగ్రెస్ గ్రోత్ రేట్' అనే పేరే సరిపోయేది" అని ప్రధాని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో సరైన పాలన, స్పష్టమైన విధానాలు, అభివృద్ధిపై చిత్తశుద్ధి, నిర్ణయాత్మక చర్యలు లేకపోవడం వల్ల దేశ ఆర్థిక ప్రగతి మందగించిందని మోదీ అన్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వాలపై విశ్వాసం దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
వివరాలు
మంచి ఉద్దేశాలతో ప్రభుత్వం పనిచేస్తే.. అభివృద్ధి కూడా వేగంగా సాధ్యమవుతుంది
అదే సమయంలో ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ స్థిరత్వం, స్పష్టమైన లక్ష్యాలు, అభివృద్ధిపై నిబద్ధతతో దేశంలో వేగవంతమైన ప్రగతి సాధ్యమని నిరూపించిందని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని పెంచడంలో ఎన్డీయే విజయవంతమైందన్నారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పుడు దేశ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని తాను చెప్పిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనపై విసుగెత్తిన ప్రజలు ఎన్డీయేపై విశ్వాసం ఉంచారని తెలిపారు. "2014లో ఉదయించిన ఆశల సూర్యుడు నేడు మరింత బలమైన ఆత్మవిశ్వాసంగా మారాడు. మంచి ఉద్దేశాలతో ప్రభుత్వం పనిచేస్తే అభివృద్ధి కూడా వేగంగా సాధ్యమవుతుందని ప్రజలు ప్రత్యక్షంగా చూశారు" అని ప్రధాని అన్నారు.
వివరాలు
పేదరికం నుంచి బయటకి 25 కోట్ల మందికి పైగా..
ఎన్డీయే పాలనలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు సరైన దిశలో సాగుతున్నాయనేందుకు ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తనను సత్కరించిన ఎన్డీయే మిత్రపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఇది తన వ్యక్తిగత ఘనత కాదని, ఎన్డీయే కూటమిలోని ప్రతి నాయకుడు, ప్రతి బీజేపీ కార్యకర్త కృషికి దక్కిన గుర్తింపని స్పష్టం చేశారు. దేశ సేవను తాను ఒక ఆధ్యాత్మిక సాధనగా భావిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా ఎన్డీయే నాయకులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.