
Narendra Modi: సౌదీ ప్రిన్స్ ఆహ్వానం మేరకు.. రెండు రోజులపాటు సౌదీ అరేబియా పర్యటనకు మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు సౌదీ అరేబియాలో అధికారిక పర్యటనకు సిద్ధమవుతున్నారు.
ఇటీవల సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో, ఆయనను సౌదీ అరేబియాకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఆ ఆహ్వానానికి స్పందనగా మోదీ ఈ నెల, అంటే 2025 ఏప్రిల్ 22 నుంచి 23 తేదీల మధ్య సౌదీ పర్యటనకు బయలుదేరనున్నారు.
ఈ పర్యటనలో భారత్-సౌదీ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఇంధన భద్రత, రక్షణ సహకారం, అలాగే ద్వైపాక్షిక సహకారంపై సమగ్ర చర్చలు జరగనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.
వివరాలు
కొత్త తేదీల ఖరారు.. ఏప్రిల్లో మోదీ పర్యటన
ఇదివరకు 2016, 2019 సంవత్సరాల్లో ప్రధాని మోదీ సౌదీ అరేబియాను సందర్శించిన అనుభవం ఉంది.
అయితే 2024 డిసెంబర్లో జరగాల్సిన మోదీ పర్యటన షెడ్యూల్ లో తలెత్తిన అసౌకర్యాల కారణంగా వాయిదా పడింది.
తాజా పరిణామాల నేపథ్యంలో కొత్త తేదీలను ఖరారు చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్లో మోదీ పర్యటన జరగనుంది.
ఈ పర్యటన ముఖ్యంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) వంటి ప్రాజెక్టుల ప్రగతిపై కీలక చర్చలకు వేదిక కానుందని సమాచారం.
ఈ సందర్శన ద్వారా భారత్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.