
Rajnath Singh: PoK అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) అంశంపై గురువారం నిర్వహించిన CII బిజినెస్ సమ్మిట్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీవోకే ప్రజలు భారత్ కుటుంబానికి భాగమేనని స్పష్టం చేశారు.
వారు త్వరలో భారత్లో కలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పీవోకేలో నివసిస్తున్న వారు మన స్వంతవారేనని, వారు మా కుటుంబ సభ్యులే అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాజకీయంగా, భౌగోళికంగా మన నుంచి వేరుగా ఉన్న ఆ సోదరులు త్వరలోనే తిరిగి మనదేశంలో భాగమవుతారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు.
PoK ప్రజలతో భారతదేశానికి ఉన్న లోతైన భావోద్వేగ సంబంధాన్ని ఆయన ప్రస్తావించారు.
వివరాలు
కొందరు తప్పుదారి పట్టినా, ఎక్కువమంది భారత్తో అనుబంధంగా ఉన్నారు.
అక్కడ ప్రజల్లో చాలా మంది భారతదేశంతో అనుబంధంతో ఉన్నారని, కేవలం కొంతమంది మాత్రమే తప్పుదారి పట్టారని అన్నారు.
భారత్ ఎప్పుడూ హృదయాలను కలిపే మార్గానే అనుసరిస్తుందని తెలిపారు.
ప్రేమ, ఐక్యత, సత్యపథంలో నడుస్తూ.. ఒక రోజు పీవోకే స్వచ్ఛందంగా తిరిగి వచ్చి "నేను భారతదేశం, నేను తిరిగి వచ్చాను" అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని తాము నమ్ముతున్నట్లు ఆయన అన్నారు.
ఇక ఉగ్రవాదంపై కూడా ఆయన గట్టిగా స్పందించారు. ఉగ్రవాదం లాభదాయకం కాదని, దాని మూల్యాన్ని తీవ్రంగా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ ఆ ప్రభావాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు.
ఈ సందర్భంగా ఇస్లామాబాద్కు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు.
వివరాలు
స్వదేశీ తయారీతో ఆపరేషన్ సిందూర్ విజయవంతం
భారత్ ఇకపై పాకిస్తాన్తో నిర్వహించే చర్చలు కేవలం ఉగ్రవాదం మరియు పీవోకే అంశాలకే పరిమితమవుతాయని స్పష్టం చేశారు.
అలాగే,దేశ రక్షణ రంగంలో పురోగతిపై కూడా మంత్రి మాట్లాడారు.
స్వదేశీ పథకాల ద్వారా భారత సైనికశక్తిని నిర్మించడంలో దేశం ఎంతమేరకు ముందుకెళ్లిందో వివరించారు.
పదిసంవత్సరాల క్రితం భారత్ రక్షణ ఎగుమతులు రూ.1,000 కోట్ల కంటే తక్కువగా ఉండేవని, కానీ ఇప్పుడు అవి రూ.23,500 కోట్లకు చేరుకున్నాయని చెప్పారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో "ఆపరేషన్ సిందూర్" విజయవంతం అయ్యిందని తెలిపారు.
ఫైటర్ జెట్లు,క్షిపణి వ్యవస్థల తయారీ విషయంలో భారత్ ఇకపై విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అంతేకాదు,రానున్న యుద్ధాలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం భారత్ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు.