Andhra Pradesh: త్వరలో విద్యుత్తు ఛార్జీల తగ్గింపు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే విద్యుత్తు ఛార్జీలను తగ్గిస్తామని సంబంధిత శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. యూనిట్పై మొత్తం 40పైసలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తొలి దశలో 13 పైసల తగ్గింపును అమలు చేశామని,మిగిలిన తగ్గింపును కూడా త్వరలోనే వర్తింపజేసి వినియోగదారులకు పూర్తి ప్రయోజనం చేకూరుస్తామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంతో పాటు టేకి గ్రామంలో నిర్మించిన రెండు కొత్త సబ్స్టేషన్లను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలకు బదులుగా ట్రూ డౌన్ ఛార్జీలను అమలు చేస్తున్నామని తెలిపారు.విద్యుత్తు రేట్లు ఒక్క రూపాయి కూడా పెంచకుండా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.
వివరాలు
రైతులకు 75 వేల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 75 వేల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు అందించామని, మరో 200 సబ్స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించామని మంత్రి వివరించారు. అసెంబ్లీకి హాజరుకాకుండా పరామర్శల పేరుతో ప్రజల్లో తిరగడం జగన్మోహన్రెడ్డికే సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఏ అంశంపైనా మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.