Quantum Valley Tech Park: అమరావతిలో దక్షిణాసియాలో తొలి శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్
ఈ వార్తాకథనం ఏంటి
క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సాంకేతిక రంగంగా మారిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి, అంతర్జాతీయ సహకారంతో క్వాంటమ్ ఆవిష్కరణలకు మరింత వేగం తీసుకురావాలనే అంశంపై దావోస్ ఆర్థిక సదస్సులో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్ ప్రసంగిస్తూ కీలక విషయాలను వెల్లడించారు. 2024లో 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ 2025 నాటికి 41 శాతం వృద్ధితో 3.77 బిలియన్ డాలర్లకు చేరిందని చెప్పారు. అలాగే ప్రపంచ క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ సగటున ఏటా 41.8 శాతం వృద్ధి రేటుతో 2030 నాటికి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వివరాలు
అమరావతిలో ఈ ఏడాది జూలై నాటికి క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు
రాజధాని అమరావతిలో ఈ ఏడాది జూలై నాటికి దక్షిణాసియాలోనే తొలి, అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నట్టు లోకేశ్ తెలిపారు. 133 క్విట్ హెరాన్ ప్రాసెసర్తో కూడిన ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్-2ను ఐబీఎం, టీసీఎస్ భాగస్వామ్యంతో ఆవిష్కరించనున్నామని చెప్పారు. ఇది భారత్లోనే తొలి డెడికేటెడ్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ కేంద్రంగా నిలవనుందని, సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనున్నామని వివరించారు. అలాగే గ్లోబల్ క్వాంటమ్ ల్యాబ్లతో కలిసి పరిశోధనా కేంద్రాలు, ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యంగా పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు.
వివరాలు
50వేలకు పైగా అభ్యాసకుల కోసం క్వాంటమ్ రెడీ స్కిల్లింగ్ కేంద్రాలు
50 వేల మందికి పైగా అభ్యాసకులకు క్వాంటమ్కు సిద్ధమైన నైపుణ్యాలు అందించే ప్రత్యేక స్కిల్లింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మూడు దశల్లో క్వాంటమ్ నైపుణ్యాల పైప్లైన్ను నిర్మించనున్నామని, ఇది ఉన్నత స్థాయి పరిశోధన, ఆవిష్కరణలను కవర్ చేసే ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ తయారీ, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.