Indian Railways: కోచ్లు, బెడ్ రోల్స్పై పెరిగిన ఫిర్యాదులు.. జోన్లకు రైల్వేశాఖ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
రైళ్లలో శుభ్రత అంశంపై ఇటీవల ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్,నవంబర్ నెలల్లో కోచ్ల శుభ్రత,బెడ్ రోల్స్కు సంబంధించిన ఫిర్యాదులు రైల్ మదద్ యాప్లో దాదాపు 50 శాతం మేర పెరిగినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ప్రయాణికుల నుంచి వచ్చిన "అద్భుతం","సంతృప్తికరం"వంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్లు కూడా తగ్గినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై రైల్వే శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రైళ్లలో శుభ్రతపై ఫిర్యాదులు పెరగడం,మంచి స్పందనలు తగ్గడాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు, ఇందుకు కారణాలను గుర్తించాలని నిర్ణయించారు.
వివరాలు
జోన్ల అలర్ట్
అలాగే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత సమర్థంగా అమలు చేయాలని అన్ని జోన్లను అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రైళ్లలో హౌస్కీపింగ్ పనులను పర్యవేక్షించే జోనల్ ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్లకు రైల్వేశాఖ లేఖ పంపింది. గణాంకాలను పరిశీలిస్తే, బెడ్ రోల్స్కు సంబంధించి గతేడాది సెప్టెంబర్లో 8,758 ఫిర్యాదులు నమోదు కాగా, అక్టోబర్లో అవి 13,406కు చేరాయి. నవంబర్లో 13,196 ఫిర్యాదులు నమోదయ్యాయి. సెప్టెంబర్తో పోలిస్తే ఈ సంఖ్యలు సుమారు 50 శాతం వరకు పెరగడం గమనార్హం. అలాగే కోచ్ల శుభ్రతపై సెప్టెంబర్లో 24,758 ఫిర్యాదులు వచ్చగా, అక్టోబర్లో 33,804, నవంబర్లో 36,673 ఫిర్యాదులు నమోదైనట్లు రైల్వే శాఖ వెల్లడించింది.