Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తాజా అంచనాల ప్రకారం, ముఖ్యంగా నేడు,రేపు ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే సమయంలో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉండగా, సూర్యపేట, వరంగల్, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
వివరాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను ముందుగానే గమనించి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదు. ముఖ్యంగా ఎత్తైన చెట్ల వద్ద ఉండటం ప్రమాదకరం, ఎందుకంటే వాటిపై పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటి ఆవరణలో భూమిలోపల ఉప్పు, కర్రబొగ్గు, రాగి వైరుతో ఎర్తింగ్ ఏర్పాటు చేస్తే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.
వివరాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మెరుపులు, పిడుగుల కారణంగా విద్యుత్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున,ఆ సమయంలో టీవీ,ఫ్రిడ్జ్ వంటి గృహోపకరణాల ప్లగ్లను స్విచ్బోర్డ్ నుంచి తొలగించడం మంచిది. పిడుగులు ఎక్కువగా తాటి చెట్లు,విద్యుత్ స్తంభాలపై పడుతుంటాయి కాబట్టి, వర్షం సమయంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఉండకూడదు. ఒకసారి పిడుగు పడిన ప్రదేశంలో మళ్లీ పడే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతానికి వెళ్లడం ప్రమాదకరం. వర్ష సూచనలు ఉన్నప్పుడు ఇనుప భాగాలు ఉన్న గొడుగులు, కెమెరాలు, సెల్ఫోన్లు చేతిలో పట్టుకుని బయట తిరగకుండా జాగ్రత్త పడాలి. పశువులను గుడిసెలు, కొట్టాలు లేదా షెడ్లలో కట్టివేయాలి, చెట్ల కింద ఉంచకూడదు. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్న సమయంలో రైతులు పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రదేశాలకు వెళ్లడం అత్యంత అవసరం.