LOADING...
Ram Temple donation case: అయోధ్య రామాలయంలో విరాళాల వివాదం.. సీసీటీవీ దృశ్యాల తారుమారుపై సిట్‌కు కీలక ఆధారాలు!
సీసీటీవీ దృశ్యాల తారుమారుపై సిట్‌కు కీలక ఆధారాలు!

Ram Temple donation case: అయోధ్య రామాలయంలో విరాళాల వివాదం.. సీసీటీవీ దృశ్యాల తారుమారుపై సిట్‌కు కీలక ఆధారాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు, విలువైన కానుకల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో తాజాగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆలయంలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఆధారాలు బయటపడకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాల వ్యవస్థను తారుమారు చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు సందర్భంగా దీనికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

వివరాలు 

భద్రతా ఏర్పాట్ల కోసం దాదాపు రూ.10 కోట్ల వరకు వ్యయం

సిట్‌ దర్యాప్తు ప్రకారం.. గత 11 నెలల కాలంలో అయోధ్య రామమందిర ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్ల కోసం దాదాపు రూ.10 కోట్ల వరకు వ్యయం చేశారు. అయినప్పటికీ విరాళాల హుండీల నుంచి నగదు, బంగారు ఆభరణాలు మాయమైనట్లు ఆరోపణలు రావడం ఆలయ భద్రతా వ్యవస్థపై అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థల పనితీరు, రికార్డయిన సీసీటీవీ దృశ్యాలు, భద్రతా నిబంధనల అమలుపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ కెమెరాల పనితీరులో తారుమారుకు సంబంధించిన కొన్ని క్లూస్‌ను సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

విరాళాల లెక్కింపు ప్రక్రియలో బ్యాంకుల పాత్రపైనా సిట్ దృష్టి

దీంతో ఆలయ భద్రతా వ్యవస్థలోని వివిధ స్థాయిల్లో ఏవైనా లోపాలు చోటుచేసుకున్నాయా..? లేదా ఇందులో ఎవరైనా సిబ్బంది ప్రమేయం ఉందా..? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది. నిఘా, భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బంది సర్వీస్ రికార్డులు, ఇతర సంబంధిత వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు విరాళాల లెక్కింపు ప్రక్రియలో బ్యాంకుల పాత్రపైనా సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ప్రక్రియలో బ్యాంకు సిబ్బందితో పోలిస్తే ట్రస్ట్ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. దీంతో విరాళాల లెక్కింపు సమయంలో ఏవైనా నిర్లక్ష్యాలు లేదా అక్రమాలు జరిగాయా అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

వివరాలు 

విచారణ కోసం 200 మంది వ్యక్తుల జాబితాను సిద్ధం చేసిన సిట్ 

ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం సుమారు 200 మంది వ్యక్తుల జాబితాను సిట్ సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటివరకు 125 మందికి పైగా వ్యక్తులను విచారించినట్లు సమాచారం. అలాగే కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌శంకర్ అలియాస్ తినూ యాదవ్‌ను సిట్ అధికారులు పలువురు గంటల పాటు ప్రశ్నించి కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుండగా.. మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement