LOADING...
Himalayas: హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న మంచు.. ముంచుకొస్తున్న పెను ప్రమాదం!
హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న మంచు.. ముంచుకొస్తున్న పెను ప్రమాదం!

Himalayas: హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న మంచు.. ముంచుకొస్తున్న పెను ప్రమాదం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2026
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందూ కుష్-హిమాలయ ప్రాంతంలో మంచు భారీగా తగ్గిపోవడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఆసియాకు 'వాటర్ టవర్'గా పరిగణించే హిమాలయాస్ పైభాగం వేగంగా ఎండిపోతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ పరిణామం దాదాపు రెండు బిలియన్ మంది ప్రజలపై ప్రభావం చూపి, భారీ నీటి సంక్షోభానికి సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ సమీకృత పర్వత అభివృద్ధి కేంద్రం విడుదల చేసిన 'HKH Snow Update 2026' నివేదిక ప్రకారం, 2025 నవంబర్ నుంచి 2026 మార్చి మధ్య మంచు నిల్వ (Snow Persistence) సగటుతో పోలిస్తే 27.8 శాతం తగ్గింది. మంచు పడిన తర్వాత అది నేలపై ఎంతకాలం నిలిచి ఉంటుందో సూచించే ఈ సూచిక పర్వత ప్రాంతాల శీతాకాల ఆరోగ్యానికి కీలకంగా పరిగణించబడుతుంది.

వివరాలు

తాగునీటి సరఫరా అవసరాలకు ఈ నీరు కీలకం

హిందూ కుష్-హిమాలయ ప్రాంతంలోని సీజనల్ మంచు సహజ నీటి నిల్వలా పనిచేస్తుంది. ఇది 12 ప్రధాన నది పరీవాహక ప్రాంతాల్లో వార్షిక నీటి ప్రవాహంలో సుమారు నాలుగో వంతు వరకు వాటా కలిగి ఉంటుంది. కాబూల్ నుంచి కోల్‌కతా వరకు వ్యవసాయం, జలవిద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరా వంటి అవసరాలకు ఈ నీటి వనరులు కీలకం. నివేదిక ప్రకారం, మెకాంగ్ నది పరీవాహక ప్రాంతంలో అత్యధికంగా 59.5 శాతం తగ్గుదల నమోదైంది.

వివరాలు

ఏ నది పరీవాహక ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం?

టిబెటన్ పీఠభూమిలో 47.4 శాతం లోటు కనిపించగా, ఎల్లో రివర్, అము దర్యా నది ప్రాంతాల్లో కూడా గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఇక గంగా నది పరీవాహక ప్రాంతంలో ఈ శీతాకాలంలో మంచు నిల్వ సగటుతో పోలిస్తే 16.3 శాతం ఎక్కువగా నమోదైంది. ఇది ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, గత నాలుగు శీతాకాలాలుగా వరుసగా సగటు కంటే తక్కువ మంచు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2003 నుంచి ఇప్పటివరకు 14 సార్లు మంచు లోటు నమోదైందని నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిస్థితులు భవిష్యత్తులో నీటి కొరతను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉన్నందున, పర్యావరణ పరిరక్షణ చర్యలు, నీటి వినియోగంలో జాగ్రత్తలు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement