Telangana : ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కట్.. పౌరసరఫరాల శాఖ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలుమార్లు సూచనలు జారీ చేసినప్పటికీ, ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయని యూనిట్లకు రేషన్ సరఫరా నిలిపివేస్తామని మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ సమీపంలోని న్యాయధర దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రం ద్వారా బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
Details
రేషన్ కోటా రద్దు అవుతుంది
ఈ-కేవైసీ పూర్తైన సభ్యులకే రేషన్ సరఫరా కొనసాగుతుందని, లేకపోతే రేషన్ కోటా రద్దు అవుతుందని స్పష్టంచేశారు. ఈ ప్రకటనతో రేషన్ కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది. గత రెండేళ్లుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిస్థాయిలో అప్డేట్ జరగలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మిగిలిన కార్డుదారులందరూ డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని శాఖ ప్రకటించింది. నిర్ణీత గడువు దాటినా ప్రక్రియ పూర్తి చేయని వారికి రేషన్ కోటా పూర్తిగా నిలిపివేయబడుతుందని హెచ్చరించారు. దీంతో రేషన్ డీలర్లు, వినియోగదారుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఇదిలా ఉండగా, కొందరు కార్డుదారుల బయోమెట్రిక్ వేలిముద్రలు ఈ-పాస్ యంత్రంలో నమోదు కావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు.
Details
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు
సాంకేతిక లోపాల కారణంగా నమోదు కాకపోతే, దాన్ని తమ తప్పుగా ఎలా పరిగణిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ-కేవైసీ గడువును డిసెంబర్ 31 తర్వాత కూడా పొడిగించాలని పలువురు కార్డుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు, రాష్ట్రంలో ఇటీవల మంజూరైన కొత్త రేషన్ కార్డుదారులకు ఇప్పటివరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, వంటగ్యాస్, గృహజ్యోతి, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందుతున్నప్పటికీ, కొత్తగా కార్డులు పొందిన వారికి అవి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుదారులకు కూడా పాత కార్డుదారుల మాదిరిగానే అన్ని సంక్షేమ పథకాలు సమానంగా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.