
Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో రేషన్ షాపులు
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ 1వ తేదీ నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకుల పంపిణీ జరగనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ప్రజలు ఎదుర్కొంటున్నఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం, ఇకపై రేషన్ వ్యాన్ కోసం గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
రైస్ స్మగ్లింగ్ను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ప్రజల శ్రేయస్సు కోసం చర్యలు తీసుకుంటున్నాయన్నారు.
మార్కెట్ ధరలు పెరిగిన సందర్భంలో,ప్రజలకు భారం లేకుండా రేషన్ షాపుల ద్వారానే సబ్సిడీ ధరలకు సరుకులు అందజేస్తామని మంత్రి వివరించారు.
వివరాలు
29,760 రేషన్ డిపోలు
ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు,ఆదివారాలు సహా రేషన్ షాపులు పనిచేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికే జూన్ 1వ తేదీ నుంచి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,760 రేషన్ డిపోల ద్వారా సరుకులు ప్రజలకు చేరేలా పౌర సరఫరాల శాఖ సన్నద్ధమైందని తెలిపారు.
విజయవాడ మధురానగర్లోని 218వ నంబర్ రేషన్ షాపులో ట్రయల్ రన్ నిర్వహించారని, తానే స్వయంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్తో కలిసి ఈ పరిశీలనలో పాల్గొన్నట్లు తెలిపారు.
ఈపోస్ మిషన్, ఎలక్ట్రానిక్ కాటా వాడకాన్ని దగ్గరుండి తనిఖీ చేశామని పేర్కొన్నారు.
వివరాలు
ఈకేవైసీ 96 శాతం పూర్తి
గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అనే పేరుతో మాయ చేసి, వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిన తీరును నిందించారు.
ఇక ప్రజలకు అవినీతి లేని, పారదర్శక వ్యవస్థను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు.
ఈకేవైసీ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా 96 శాతం పూర్తయిందని, ఇది దేశంలోనే రికార్డుగా నిలిచిందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు ఈ సాయంత్రానికి సరుకులు చేరేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ప్రతి షాపు ఫొటోను యాప్ ద్వారా ఆన్లైన్లో ఉంచినట్లు వివరించారు. ఈపోస్ మిషన్, ఎలక్ట్రానిక్ కాటా మరియు ఇతర సర్వీసింగ్ ప్రక్రియలను ఉచితంగా చేస్తామని పేర్కొన్నారు.
వివరాలు
ప్రజలు కూడా రేషన్ షాపుల ద్వారానే సరుకులు అందుకోవాలి
ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించామని, 218వ నంబర్ షాపులో డీలర్గా పనిచేస్తున్న పసుపులేటి శివప్రసాద్ 30 ఏళ్లుగా ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
వృద్ధులు, దివ్యాంగులు వంటి ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి వారి నివాసాలకే సరుకులు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి అన్ని డీలర్లను తగిన శిక్షణతో సిద్ధం చేశామన్నారు.
రేషన్ షాపులు జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో కూడా పని చేయనున్నాయని స్పష్టంగా చెప్పారు.
ఎండియూలు 10 శాతం మొత్తాన్ని చెల్లించగా,మిగతా మొత్తం కార్పొరేషన్ ద్వారా చెల్లించి వాహనాలను అందిస్తున్నామని వివరించారు.
ప్రజలు కూడా రేషన్ షాపుల ద్వారానే సరుకులు అందుకోవాలని కోరుతున్నారని చెప్పారు.
వివరాలు
రేషన్ షాపుల్లో తక్కువ ధరకే సరుకులు అందిస్తాం
ప్రజలు 15 రోజుల వ్యవధిలో, తమకు అనుకూలమైన సమయంలో సరుకులు తీసుకువెళ్లేలా సౌకర్యం కల్పించామని తెలిపారు.
మార్కెట్లో ధరలు పెరిగే వస్తువులను పరిశీలించి, రేషన్ షాపుల్లో తక్కువ ధరకే అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశ్యం ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమేనని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంగా తెలిపారు.