
Kiren Rijiju : ఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్లో చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు పలు కీలక అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చకు తీసుకురావాలని ప్రతిపక్షాలు సూచించాయి. ఇందుకు స్పందనగా ప్రభుత్వం సభ సజావుగా సాగేలా ప్రతిపక్షాల సహకారాన్ని కోరింది. అంతేకాదు ఆయా అంశాలపై నిర్మాణాత్మక చర్చకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది.
Details
కీలక అంశాలపై చర్చ
సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు, తాము విశాల హృదయంతో అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. పార్లమెంట్ నిబంధనలు, సంప్రదాయాల మేరకు వ్యవహరించామని, అవి తమకు ఎంతో విలువైనవని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ వంటి కీలక అంశాలపై చర్చకు తాము సిద్ధమని ఆయన అన్నారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసుపై మాట్లాడుతూ.. ఇటీవల కాలిపోయిన రూ.500 నోట్ల కట్టలు దొరికిన నేపథ్యంలో ఆయనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
Details
జూలై 21 నుంచి ప్రారంభం
ఇప్పటికే వంద మంది ఎంపీలు దీనిపై సంతకాలు చేశారని, అన్ని పార్టీలు కలిసి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాయని స్పష్టం చేశారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ చర్య కాదని, సమిష్టి నిర్ణయమని పేర్కొన్నారు. ఇక బీహార్ ఓటర్ల జాబితా సవరణ అంశంతోపాటు విదేశాంగ విధానంపై చర్చ కూడా అవసరమని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ వెల్లడించారు. వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు కొనసాగనున్నట్లు సమాచారం.